హైదరాబాద్: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా 86 పరుగుల తేడాతో పాక్పై ఘన విజయం సాధించింది. ఈ వన్డేలో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, స్మిత్ మాక్స్వెల్, హెడ్లు చెలరేగి ఆడారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 6 వికెట్లకు 353 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఓపెనర్ వార్నర్ 119 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 130 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్ స్మిత్ 48 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 49 పరుగులు చేసి వార్నర్తో కలిసి రెండో వికెట్కు 120 పరుగులు జోడించాడు. 98 బంతుల్లో వార్నర్ తన కెరీర్లో 12వ సెంచరీని సాధించాడు. అలాగే తన చివరి ఆరు వన్డేల్లో మూడో సెంచరీ కావడం విశేషం.
ఇక చివర్లో మ్యాక్స్వెల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 44 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సుతో 78 పరుగులు చేశాడు. ఆసీస్ చివరి పది ఓవర్లలో 118 పరుగులు చేయడం విశేషం. దీంతో నిర్ణీత 50 ఓవర్లకు గాను ఆస్ట్రేలియా 6 వికెట్లను కోల్పోయి 353 పరుగులు చేసింది.
అనంతరం 354 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 43.5 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌట్ అయ్యింది. పాకిస్ధాన్ జట్టులో షర్జీల్ ఒక్కడే 74 పరుగులు చేసి అర్ధసెంచరీని నమోదు చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లు హాజెల్వుడ్, జంపా చెరో మూడు వికెట్లు తీసుకున్నారు.
సిడ్నీ వన్డే విజయంతో ఆస్ట్రేలియా మరో వన్డే మిగిలుండగానే ఐదు వన్డేల సిరిస్ను ఆస్ట్రేలియా 3-1తో కైవసం చేసుకుంది. ఐదో వన్డే ఈనెల 26న అడిలైడ్లో జరగనుంది.