కొలంబో: అంతర్జాతీయ క్రికెట్కు శ్రీలంక ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్ వీడ్కోలు పలకనున్నాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరిస్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పనున్నట్లు దిల్షాన్ గురువారం ప్రకటించాడు.
దేశం తరుపున ఇప్పటికే సుదీర్ఘకాలం క్రికెట్ ఆడిన తనకు ఆస్ట్రేలియా సిరీసే చివరదని పేర్కొన్నాడు. ఆదివారం దంబుల్లాలో జరిగే వన్డే మ్యాచ్, అదే విధంగా సెప్టెంబర్ 9న కొలంబోలో జరిగే టీ20 మ్యాచ్లు తనకు చవరి మ్యాచ్లని పేర్కొన్నాడు.
దిల్షాన్ 2013లోనే టెస్టు క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. కాగా ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరిస్లో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఇప్పటికే ముగిసిన రెండు వన్డేల్లో తొలి వన్డేలో 22 పరుగులు చేయగా, రెండో వన్డేలో 10 పరుగులు మాత్రమే చేశాడు.
పేలవమైన ప్రదర్శన కనబరుస్తోన్న దిల్షాన్పై శ్రీలంక సెలక్టర్లు ఒత్తడి చేశారు. 1999లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేసిన దిల్షాన్ ఇప్పటివరకూ 329 వన్డేలు ఆడాడు. ఇందులో 22 సెంచరీలతో పాటు 47 అర్ధ సెంచరీలు చేశాడు.
వన్డేల్లో దిల్షాన్ అత్యధిక స్కోరు 161 కాగా, యావరేజ్ 39. 26, స్ట్రైక్ రేట్ 86.34గా ఉంది. ఇక బౌలింగ్ లో 106 వికెట్లు పడగొట్టాడు. 2015 సంవత్సరంలో 1207 పరుగులు చేసి మోస్ట్ సక్సెస్ పుల్ ప్లేయర్ గా నిలిచాడు. వరల్డ్ 20 టోర్నీలో కూడా శ్రీలంక తరుపున టాప్ స్కోరర్గా నిలిచాడు.