హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రసార హక్కులను స్టార్ నెట్వర్క్ యాజమాన్యానికి ఇవ్వొద్దని కేంద్ర సమాచార ప్రసారాల శాఖతో పాటు బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ, బీసీసీఐ పాలకుల కమిటీని డిష్ టీవీ కోరింది.
ఈ మేరకు అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ డిష్ టీవీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జవహర్ గోయల్ ఓ లేఖను సమర్పించారు. స్టార్ నెట్వర్క్కి ఇప్పటికే హోం సిరిస్, దేశవాళీ క్రికెట్తో పాటు ఐసీసీ టోర్నమెంట్ ప్రసార హక్కులు, ఆసియా కప్ హక్కులు కూడా ఉన్నాయి.
దీంతో పాటుగా ఇతర దేశాలైన ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ క్రికెట్ టోర్నమెంట్ల ప్రసార హక్కులు కూడా ఉన్నాయి. తాజాగా ఐపీఎల్ ప్రసార హక్కులను కూడా స్టార్కే ఇస్తే క్రీడల ప్రసారాల విభాగంలో స్టార్ నెట్వర్క్ గుత్తాధిపత్యం పెరిగి, వీక్షకులు పెద్దమొత్తాల్లో సబ్స్క్రిప్షన్ ధరలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
ఈ లేఖను సమాచార శాఖ, బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీలతో పాటు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాలకు కూడా ఆయన పంపారు. ఇలాంటి పరిస్థితి కాంపిటేటివ్ ప్రపంచంలో ఎంత మాత్రం మంచిది కాదని ఆయన పేర్కొన్నారు.