రాంచీ: ఐదు వన్డేల సిరిస్లో నిలబడాలంటే చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు ఆల్ రౌండర్ ప్రదర్శనను చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన 261 పరుగుల లక్ష్యాన్ని కాపాడు కోవడంలో న్యూజిలాండ్ బౌలర్లు సక్సెస్ అయ్యారు. టీమిండియా బ్యాటింగ్ లైనప్ను దెబ్బతీసి 48.4 ఓవర్లకే 241 పరుగులకే ఆలౌట్ చేసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
దీంతో టీమిండియాపై న్యూజిలాండ్ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో ఐదు వన్డేల సిరీస్ 2-2తో సమం చేసింది. దీంతో వన్డే సిరీస్ విజేత ఎవరనేది విశాఖపట్నం వేదికగా శనివారం జరిగే వన్డేలో తేలనుంది. 261 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్లు మొదట్లో నిలకడగానే రాణించారు.
ఓపెనర్ రహానే 57 పరుగులతో జట్టును విజయం వైపు నడిపించేందుకు తన వంతు ప్రయత్నం చేశాడు. అతనికి తోడుగా రెండో వికెట్గా వచ్చిన విరాట్ కోహ్లీ కూడా 45 పరుగులతో ఇద్దరూ 79 పరుగుల భాగస్వామ్యన్ని అందించారు. ఈ క్రమంలో న్యూజిలాండ్ బౌలర్లపై ఒత్తిడి తెచ్చేందుకు గాను ఈ జోడీ ప్రయత్నించింది.
అయితే న్యూజిలాండ్ జట్టు విజయంలో విరాట్ కోహ్లీని త్వరగా పెవిలియన్కు చేర్చడమే అత్యంత కీలక పరిణామమని న్యూజిలాండ్ బ్యాట్స్మన్ మార్టిన్ గప్టిల్ అభిప్రాయపడ్డాడు. నాలుగో వన్డేలో అద్భుతమైన ఫామ్లోకి వచ్చిన గుప్టిల్ న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
నిజానికి గుప్టిల్ 29 పరుగుల వద్ద ఔట్ కావాల్సి ఉంది. ఉమేశ్ యాదవ్ వేసిన ఏడో ఓవర్లో గుప్టిల్ ఇచ్చిన క్యాచ్ను అమిత్ మిశ్రా విడిచిపెట్టాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న గుప్టిల్ మ్యాచ్లో మరో 43 పరుగులు అధికంగా చేశాడు. దీంతో మొత్తం 84 బంతుల్లో 72 పరుగులు చేసిన గుప్టిల్కి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' దక్కింది.
4వ వన్డే: మిశ్రా ఆ క్యాచ్ పట్టి ఉంటే, ఫలితం మరోలా ఉండేది
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న అనంతరం గుప్టిల్ మీడియాతో మాట్లాడాడు. కోహ్లీ క్లాస్ ప్లేయరని, 45 పరుగుల వద్ద విరాట్ కోహ్లీని ఔట్ చేయడం తమకు ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్పాడు. 'విరాట్ క్లాస్ ప్లేయర్. అతన్ని త్వరగా ఔట్ చేయడం ఆనందమే కదా' అని అన్నాడు.
రన్ మెషిన్గా పేరుగాంచిన కోహ్లీ ఈ మధ్య కాలంలో అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. న్యూజిలాండ్తో జరుగుతున్న వన్డే సిరిస్లో టీమిండియాకు అద్భుత విజయాలు అందించిన సంగతి తెలిసిందే. మొహాలిలో జరిగిన మూడో వన్డేలో 154 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఇక ధర్మశాలలో జరిగిన తొలివన్డేలో 85 పరుగులు చేసి టీమిండియాకు విజయాన్ని అందించాడు. కాగా, నాలుగో వన్డేలో 11 పరుగుల వద్ద ధోని ఔట్ కావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. టీమిండియా బ్యాట్స్మెన్లు రహానే 57, కోహ్లీ 45, అక్షర్ పటేల్ 38 ధాటిగా ఆడినప్పటికి విజయ లక్షాన్ని చేరుకోలేకపోయింది.
కేదార్ జాదవ్ (0), మనీశ్ పాండే (12), హార్ధిక్ పాండ్య (9) కీలక సమయంలో వికెట్లను చేజార్చుకున్నారు. చివర్లో కులకర్ణి బ్యాటింగ్తో మెరుపులు మెరిపించి విజయంపై ఆశలు రేపాడు. ఉమేశ్ యాదవ్తో కలిసి 34 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన భారత్ ఓటమి పాలైంది.