హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలను పోల్చడం సరికాదని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్ అభిప్రాయపడ్డాడు. చెన్నైలోని వేలమ్మాళ్ విద్యాలయాన్ని జాంటీ రోడ్స్ బుధవారం సందర్శించాడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రోడ్స్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు.
'నాకు రికార్డులపై పెద్దగా నమ్మ కం లేదు. భిన్న తరాలకు చెందిన వ్యక్తుల మధ్య పోలిక అంటే నాకు ఇష్టం ఉండదు. తమ మార్గాల్లో వారిద్దరూ గొప్ప ఆటగాళ్లే. టెండూల్కర్.. టెండూల్కరే, విరాట్ కోహ్లీ.. విరాట్ కోహ్లీనే. ఎవరి గొప్పతనం వారిది' అని జాంటీ రోడ్స్ చెప్పుకొచ్చాడు.
ఇక విద్యార్థులు సచిన్ రికార్డుల్ని కోహ్లీ బద్దలు కొడతాడా? అన్న ప్రశ్నకు గాను 'సచిన్ 16 ఏళ్ల వయసులోనే అరంగేట్రం చేసి సుమారు 40 ఏళ్ల వరకు ఆడాడు. 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో రికార్డులను నెలకొల్పాడు. కోహ్లీ అన్ని సంవత్సరాలు క్రికెట్ ఆడతాడని నేననుకోవడం లేదు. ఆధునిక క్రికెట్లో సుదీర్ఘ కెరీర్ సాధ్యపడకపోవచ్చు' అని రోడ్స్ అన్నాడు.
మరోవైపు కోహ్లీ తన కెరీర్ను చాలా బాగా ఆరంభించాడని అతడి పరుగుల ప్రవాహం అమోఘమని ప్రశంసించాడు. అంతేకాదు చాలా తక్కువ వయసులోనే చాలా పరుగులు చేశాడని అన్నాడు. కొన్నేళ్లుగా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడని, కోహ్లీని సచిన్తో పోల్చకూడదని అన్నాడు.
ఇక భారత జట్టులో యువరాజ్సింగ్, కైఫ్ అత్యుత్తమ ఫీల్డర్లు. టెస్ట్ క్రికెట్ కంటే వన్డేల భవిష్యత్తు ప్రమాదకరంగా మారిందని జాంటీ రోడ్స్ అన్నాడు.