ముంబై : పాక్ ను ఏకాకి చేయాలన్న భారత ప్రభుత్వ ఆలోచనలకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నుంచి కూడా మద్దతు లభిస్తోంది. ఇకనుంచి భారత్ ఆడే క్రికెట్ సిరీస్ లలో భారత్ పాక్ ను ఒకే గ్రూపులో ఉంచరాదన్న ప్రతిపాదనను ఐసీసీ ముందు పెట్టింది బీసీసీఐ. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న భారత్ పాక్ క్రికెట్ సంబంధాలు.. ఈ చర్యతో మరింత క్షీణించనున్నాయి.
భవిష్యత్తులో భారత్ పాక్ పాల్గొనబోయే ఏ టోర్నీలోను పాక్ ఉన్న గ్రూపులో భారత్ ను ఉంచవద్దని ఐసీసీకి విజ్ఞప్తి చేసింది బీసీసీఐ. దౌత్యపరంగా పాక్ ను ఏకాకి చేయాలన్న భారత ప్రభుత్వ వ్యూహానికి మద్దతుగా తాము ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్టుగా బీసీసీఐ చైర్మన్ అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. అయితే రెండు జట్లను వేర్వేరు గ్రూపుల్లో ఉంచడం ద్వారా.. గ్రూపు దశలో ముఖాముఖి పోటీలు ఉండకపోయినా.. ఒకవేళ సెమీస్ లోను, ఫైనల్లోను తలపడాల్సి వచ్చినప్పుడు మాత్రం ఆ పరిస్థితి నుంచి తప్పించుకోలేమని అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
కాగా, మరో ఏడు నెలల్లో చాంపియన్ ట్రోఫి జరగనున్న నేపథ్యంలో.. బీసీసీఐ ఈ ప్రతిపాదనను తెరమీదకు తెచ్చింది. ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇవ్వబోయే ఈ టోర్నమెంట్ లో చాలా దేశాలు పాల్గొంటాయి కాబట్టి పాక్ ఉన్న గ్రూపులో భారత్ ను చేర్చరాదని బీసీసీఐ ఐసీసీని కోరింది.