హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని స్లెడ్జింగ్ చేయొద్దని ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మైకెల్ హస్సీ ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ను హెచ్చరించాడు. కోహ్లీని స్లెడ్జింగ్ చేస్తే అతడు మరింత దూకుడుగా ఆడతాడని పేర్కొన్నాడు. నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్ కోసం ఆస్ట్రేలియా జట్టు ఫిబ్రవరిలో భారత పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే.
స్లెడ్జింగ్ చేస్తాం: కోహ్లీ కోపంగా ఉండాలన్న స్టీవ్ స్మిత్
గత డిసెంబర్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ మీడియాతో మాట్లాడుతూ నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్లో కోహ్లి కాస్త కోపంగా ఉండాలని పేర్కొన్నాడు. 'వరుస విజయాలతో దూసుకుపోతున్న కోహ్లీ నేతృత్వంలోని టీమిండియాను అడ్డుకోవడం ఆస్ట్రేలియాకు పెద్ద సవాలే. అయితే ఈ సిరిస్లో కెప్టెన్ కోహ్లీ కోపంగా ఉంటే ఆటపై అతడి ఏకాగ్రత చెదురుతుందని, అది ఆసీస్కు లాభిస్తుంది' అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
''మైదానంలో కోహ్లి చాలా భావోద్వేగంతో ఉంటాడు. అయితే భారత్లో అతడు మెరుగ్గా ఉన్నాడని తెలిపాడు. అతడికి కాస్త కోపమొచ్చేలా చేయడానికి ప్రయత్నిస్తాం. అప్పుడు అతడి ఏకాగ్రత చెదురుతుంది. అతడికి చికాకు తెప్పిస్తే టీమిండియా కాస్త బలహీనంగా మారే అవకాశముంది'' అని పేర్కొన్నాడు.
గతంలో ఆస్ట్రేలియా, టీమిండియా ఆటగాళ్ల మధ్య జరిగిన కొన్ని స్లెడ్జింగ్ ఘటనలను ప్రత్యక్షంగా చూసిన హస్సీ... కోహ్లీ విషయంలో స్లెడ్జింగ్ సరైన ఐడియా కాదని స్టీవ్ స్మిత్ వ్యాఖ్యలను ఉద్దేశించి తెలిపాడు. 2014-15 ఆసీస్ పర్యటనలో బాక్సింగ్ డే టెస్టులో కోహ్లీని క్రీజులో కుదురుకోనీయకుండా స్లెడ్జింగ్కు ప్రయత్నించామని, అయితే కోహ్లీ ఆ టెస్టులో మరింత దూకుడుగా ఆడి 169 పరుగులు సాధించిన వైనాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశాడు.
ప్రపంచంలో ఎంతో మంది దిగ్గజ ఆటగాళ్లు ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్లెడ్జింగ్కు భయపడిన సందర్భాలున్నా కోహ్లీ మాత్రం స్లెడ్జింగ్ను ఎంజాయ్ చేస్తాడని హస్సీ పేర్కొన్నాడు. పోరాడటం అంటే కోహ్లికి చాలా ఇష్టం. క్రీజులో ఉన్నంత వరకు అతను పోరాడుతూనే ఉంటాడు. అలాంటి వ్యక్తిని రెచ్చగొట్టడం మంచిది కాదు. అతని కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు ఉన్నాయి. వాటిని అమలు చేస్తే చాలు అని హస్సీ అన్నాడు. కోహ్లీని తానెప్పుడూ స్లెడ్జింగ్ చేయలేదని చెప్పిన హస్సీ, కోహ్లీ ఓ రియల్ కాంపిటేటర్ అని ప్రశంసించాడు.
తమ నైపుణ్యాన్ని సరిగ్గా వినియోగించుకొని, చాలాకాలం పాటు వాటిని అమలు చేసే టీమే అత్యున్నత విజయాలు సాధిస్తుంది అని హస్సీ చెప్పాడు. అంతేకానీ దూకుడుగా వ్యవహరించడం, నోటికి పని చెప్పే టీమ్ గెలవదని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా టీమ్ వరకు కోహ్లిని త్వరగా ఔట్ చేయడమే లక్ష్యం కావాలని, అతను నిలదొక్కుకుంటే కష్టమేనని హస్సీ స్పష్టంచేశాడు. ఇదిలా ఉంటే భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు ఫిబ్రవరి 23న పూణెలో ప్రారంభం కానుంది.