హైదరాబాద్: గత కొంతకాలంగా వ్యతిరేకిస్తున్న నిర్ణయ సమీక్ష పద్ధతి (డీఆర్ఎస్)పై బీసీసీఐ మనసు మార్చుకుంది. భారత్, ఇంగ్లాండ్ మధ్య వచ్చే నెలలో జరగనున్న ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో డీఆర్ఎస్ విధానాన్ని ఉపయోగించేందుకు బీసీసీఐ అంగీకరిచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డీఆర్ఎస్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీసీసీఐ స్వదేశంలో ఇంగ్లాండ్తో నవంబర్ 9 నుంచి రాజ్ కోట్లో ఆరంభం కానున్న టెస్టు సిరిస్లో ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు బోర్డు అంగీకరించింది. డీఆర్ఎస్ విధానాన్ని ఐసీసీ మరింతగా మెరుగుపరిచి అందుకు సంబంధించిన వీడియో ప్రజెంటేషన్ను బీసీసీఐ పెద్దలకు చూపించారు.
ఈ ప్రజెంటేషన్ను బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్తో పాటు టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు కోచ్ అనిల్ కుంబ్లే కూడా వీక్షించారు. కుంబ్లే ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ హోదాలో ఇందులో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ భారత్ ఎప్పుడు డీఆర్ఎస్ను వద్దనలేదని దాని పనితీరుపైనే అనుమానాలు వ్యక్తం చేసిందని పేర్కొన్నారు.
ఈ ప్రజంటేషన్లో బీసీసీఐ చేసిన కొన్ని సూచనలను ఐసీసీ కూడా ఆమోదించనందుకు సంతోషంగా ఉందని తెలిపాడు. 'మెరుగుపరిచిన డీఆర్ఎస్ పై సంతోషంగా ఉన్నాం. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్తో డీఆర్ఎస్ను పరీక్షిస్తాం. దాని పనితీరు ఎలా ఉంది. ఆ పద్ధతి ఎంతవరకూ సఫలీకృతం కానుంది అనేది రాబోవు టెస్టు సిరీస్లో పర్యవేక్షిస్తాం. ప్రత్యేకంగా ఎల్బీడబ్యూ నిర్ణయాల్లో డీఆర్ఎస్ పాత్ర పెద్దది. ఎల్బీని నిర్దారించే విషయంలో బంతి ఎంతవరకూ బ్యాట్స్మన్ ప్యాడ్ను తాకింది అనే అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాం. బాల్ ట్రాకింగ్ టెక్నాలజీలో భాగంగా అల్ట్రా మోషన్ కెమెరాలను ఉపయోగించనున్నారు' అని బీసీసీఐ అధ్యక్షడు అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
డీఆర్ఎస్ టెక్నాలజీలో భాగంగా బాల్ ట్రాకింగ్, హాక్ ఐ టెక్నాలజీకి సంబంధించి భారత్కు ఉన్న సందేహాలను ఎమ్ఐటీ నిపుణుల బృందం నివృత్తి చేసిందని బీసీసీఐ సెక్రటరీ అజయ్ షిర్కే తెలిపారు.
కాగా 2008లో శ్రీలంకతో టెస్టు సిరీస్లో ఆడిన సందర్భంలో డీఆర్ఎస్ విధానాన్ని వాడారు. ఈ డీఆర్ఎస్ టెక్నాలజీతో ఈ మ్యాచ్లో ఎక్కవ భాగం నిర్ణయాలు భారత్కు జట్టుకు ప్రతికూలంగా వచ్చాయి. ఆనాటి నుంచి ఏ సిరీస్లోనూ డీఆర్ఎస్ వాడేందుకు బీసీసీఐ అంగీకరించలేదు.
డీఆర్ఎస్ విధానం వల్ల టెస్టుల్లో కలిగే మార్పులు:
* టెస్టుల్లో బాల్ ట్రాకింగ్ కోసం ఆల్ట్రా మోషన్ కెమెరాలను వినియోగిస్తారు.
* ఆల్ట్రా ఎడ్జి కోసం అంశంపై మానవీయ జోక్యం ఉంటుంది
* బీసీసీఐ సూచనల ఆధారంగా అదనంగా కెమెరాలను ఇనిస్టాల్ చేస్తారు