హైదరాబాద్: ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్మెన్ ఎవరు? అనే డిబేట్లో తాజాగా ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ చేరాడు. ఇందులో భాగంగా ఈ ఏడాది మూడు ఫార్మెట్లలో పరుగుల సునామీ సృష్టించిన టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి కంటే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జో రూట్ అత్యుత్తమ క్రికెటరని స్టువర్ట్ బ్రాడ్ అభిప్రాయపడ్డాడు.
'కోహ్లి, జో రూట్, స్టీవ్ స్మిత్(ఆస్ట్రేలియా) ఈ ముగ్గురిలో ఎవరు అత్యుత్తమ బ్యాట్స్మెన్ అని నన్ను అడిగితే నా ఓటు జో రూట్కే. ఎందుకంటే అతనితో కలిసి నేను చాలా మ్యాచ్లు ఆడాను. ప్రతికూల పరిస్థితుల్లో కూడా పరుగులు రాబట్టడం ఎలాగో అతనికి బాగా తెలుసు' అని చెప్పుకొచ్చాడు.
ఇక ఇటీవల భారత్తో ముగిసిన టెస్టు సిరిస్లో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్కు ముగ్ధుణయ్యానని తెలిపాడు. కోహ్లీని అవుట్ చేసేందుకు ఇంగ్లాండ్ బౌలర్లు ఎంతగానో శ్రమించాల్సి వచ్చిందని బ్రాడ్ వివరించాడు. ఇంగ్లాండ్తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్లో కోహ్లి ఒక డబుల్ సెంచరీతో పాటు 655 పరుగులు చేశాడు.
అయితే కోహ్లీ, స్మిత్ల టాలెంట్ను సైతం మెచ్చుకున్నాడు. ఈ ఏడాది జోరూట్ ఎంతో నిలకడగా ఆడాడని చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఏడాది 17 టెస్టులాడిన జో రూట్ 1,477 పరుగులతో టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇందులో మూడు సెంచరీలు, 10 అర్ధసెంచరీలు ఉన్నాయి. 2016లో జో రూట్ యావరేజి 49.23గా ఉంది.
ఈ ఏడాది 12 టెస్టులాడిన విరాట్ కోహ్లీ 1,251 పరుగులు చేశాడు. అందులో మూడు డబుల్ సెంచరీలు, నాలుగు సెంచరీలు ఉన్నాయి. 2016లో కోహ్లీ యావరేజి 75.93గా ఉంది. 2016 చివరికి మూడు ఫార్మెట్లలో 50కి పైగా యావరేజిని కలిగి ఉన్న ఒకే ఒక్క ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.
ఇక ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ 11 మ్యాచ్ల్లో 914 పరుగులతో సత్తా చాటాడు. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది.