హైదరాబాద్: మూడు వన్డేల సిరిస్లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో వన్డే గురువారం కటక్లో జరగనుంది. దీంతో టీమిండియా కెప్టెన్ కోహ్లీని సాధ్యమైనంత వరకు క్రీజులో కుదురుకోనీయకుండా అడ్డుకుంటామని, ఇందుకు షార్ట్ పిచ్ బంతులను మార్గం ఎంచుకుంటామని ఇంగ్లాండ్ పేసర్ జేక్ బాల్ తెలిపాడు.
ధోని నుంచి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పూణెలో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. 105 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లు సాయంతో 122 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కేదార్ జాదవ్ 76 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 120 పరుగులు చేయడంతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ఇంగ్లండ్ నిర్దేశించిన 351 పరుగుల భారీ లక్ష్యాన్ని కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఏడు వికెట్లు కోల్పోయి మరో 11 బంతులు మిగిలుండగానే ఛేదించింది. 63 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను కోహ్లీ-జాదవ్ల జోడీ ఆదుకుంది. వీరిద్దరూ ఐదో వికెట్కు 200కు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఈ నేపథ్యంలో కటక్లో జరగనున్న రెండో వన్డేలో భారత బ్యాట్స్మెన్లను కట్టడి చేయాలని ఇంగ్లాండ్ పేసర్ జేక్ బాల్ అంటున్నాడు. కెప్టెన్ కోహ్లీని త్వరితగతిన పెవిలియన్కు పంపితే ఇంగ్లాండ్ తప్పక విజయం సాధిస్తుందని చెప్పాడు. కోహ్లీని అవుట్ చేయడానికి కొత్త ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నామని చెప్పాడు.
పూణె వన్డేలో 67 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకున్న బాల్ కోహ్లీలాంటి అత్యుత్తమ ఆటగాడిని త్వరగా పెవిలియన్ బాట పట్టించాలని, లేకపోతే తమ జట్టు మరోసారి మూల్యం చెల్లించుకోక తప్పదని అభిప్రాయపడ్డాడు. కోహ్లీ అద్భుత ఆటగాడని, టెస్టు సిరిస్లో అతడి ఆటను చూశానని అన్నాడు. ఇప్పుడు వన్డేల్లో కూడా అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నాడని ప్రశంసించాడు.