హైదరాబాద్: జనవరి 15 నుంచి ఇంగ్లాండ్తో జరగనున్న వన్డే, టీ20 సిరిస్లకు ఈనెల 6న భారత జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు బుధవారం బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. మూడు వన్డేల సిరిస్లో పూణెలో జరగనున్న తొలి వన్డేతో వన్డే సిరిస్ ప్రారంభం కానుంది.
ధోని సంచలన నిర్ణయంతో ఆశ్చర్యం: ట్విట్టర్లో ఎవరేమన్నారు?
జాతీయ సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అధ్యక్షతన ముంబైలో జరిగే సమావేశంలో శుక్రవారం జట్లను ఎంపిక చేయనున్నారు. జనవరి 26న కాన్పూర్లో జరిగే మ్యాచ్తో టీ20 సిరిస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వన్డేలు, టీ20 సిరీస్ల కోసం వేర్వేరు జట్లను ఎంపిక చేయనున్నారు.
మహేంద్ర సింగ్ ధోని ఫోటో గ్యాలరీ
బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ బుధవారం మీడియాతో మాట్లాడుతూ ముంబైలోని వాంఖడె స్టేడియంలోని క్రికెట్ సెంటర్లో జనవరి 6వ తేదీన జాతీయ సెలక్షన్ కమిటీ సభ్యులు సమావేశమవుతారని తెలిపారు. ఇంగ్లాండ్తో జరగనున్న మూడు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ కోసం జట్టును ఎంపిక చేస్తారని తెలిపాడు.
దీంతో పాటు వన్డే సిరీస్ ముందు ఇంగ్లాండ్తో జరిగే రెండు వామప్ మ్యాచ్ల కోసం భారత ఏ జట్టును కూడా ప్రకటిస్తారని రాహుల్ జోహ్రీ తెలిపాడు. ఇటీవల ఇంగ్లాండ్తో ముగిసిన టెస్టు సిరిస్ను 4-0తో కైవసం చేసుకుని టీమిండియా మంచి జోరుతో ఉంది.
కెప్టెన్గా ఒక శకం ముగిసింది: ధోని సాధించిన విజయాలివే
మరోవైపు కెప్టెన్గా టీమిండియాను పదేళ్ల పాటు నడిపించిన ధోని పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన ఆటగాడిగా మాత్రం కొనసాగుతానని ధోని చెప్పినట్టు బీసీసీఐ ట్విట్టర్లో తెలిపింది. దీంతో ఇంగ్లాండ్తో జరగబోయే వన్డే, టీ20 సిరిస్కు ధోని వికెట్ కీపర్-బ్యాట్స్మన్గా అందుబాటులో ఉంటాడు.
కెప్టెన్సీకి ధోని గుడ్ బై చెప్పడంతో కోహ్లీనే అన్ని ఫార్మాట్లకు కెప్టెన్సీ వహించనున్నాడు. ఇదిలా ఉంటే బీసీసీఐ అధ్యక్షుడు, కార్యదర్శులపై సుప్రీంకోర్టు వేటు వేస్తూ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో అసలు ఇంగ్లాండ్తో సిరీస్ ఉంటుందా లేదా అనేది సందిగ్ధం కూడా నెలకొంది.