జో రూట్ వివాదాస్పదంగా అవుట్
'తదుపరి గేమ్కు ముందే అంఫైరింగ్పై ఫిర్యాదు చేసే అవకాశం లభించింది. క్లిష్ట సమయంలో జో రూట్ వివాదాస్పదంగా అవుట్ కావడం మా ఓటమికి కారణమైంది. దీనిపై రిఫరీకి ఫిర్యాదు చేయనున్నాం. ట్వంటీ 20ల్లో డీఆర్ఎస్ ఎందుకు లేదో అర్థం కావడం లేదు' అని మోర్గాన్ ఆందోళన వ్యక్తం చేశాడు.
20వ ఓవర్లో విజయం నుంచి దూరంగా
'చాలా నిరాశపరిచింది. జో రూట్ వికెట్ కోల్పోవడంతో 20వ ఓవర్లో విజయం నుంచి దూరంగా వెళ్లింది. తమ ఇన్నింగ్స్ 20 ఓవర్లో జో రూట్ అవుట్ కావడమే మ్యాచ్ను మలుపు తిప్పింది. ఒకవేళ జో రూట్ అవుట్ను తాము సవాల్ చేసే అవకాశం ఉంటే కచ్చితంగా మ్యాచ్ను గెలిచేవాళ్లం' అని మోర్గాన్ ధీమా వ్యక్తం చేశాడు.
జోరూట్ను తన తొలి బంతికే ఎల్బీడబ్ల్యూగా
చివరి ఓవర్ వేసిన టీమిండియా పేసర్ బుమ్రా.. జోరూట్ను తన తొలి బంతికే ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్కు చేర్చాడు. అయితే ఆ బంతి జో రూట్ బ్యాట్కు తగిలిన తర్వాతే అతని ప్యాడ్లకు తాకినట్లు రీప్లేలో స్పష్టమైంది. కొన్ని సందర్బాల్లో ఇలా జరగడం సాధారణమే అయినా, అదే తాము మ్యాచ్ను కోల్పోవడానికి కారణమైందని ఇంగ్లాండ్ అంటోంది.
జస్ప్రీత్ బుమ్రాను నమ్మిన కెప్టెన్ కోహ్లీ
కాగా, చివరి ఓవర్లో విజయానికి ఎనిమిది పరుగుల దూరంలో నిలిచిన ఇంగ్లాండ్ను కట్టడి చేసే బాధ్యతను జస్ప్రీత్ బుమ్రాకు భారత కెప్టెన్ కోహ్లీ అప్పచెప్పాడు. చివరి ఓవర్లో ఇంగ్లాండ్ జట్టు 8 పరుగులు చేయాల్సి ఉండగా బూమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తొలి బంతిలోనే జో రూట్ను అవుట్ చేశాడు. రెండో బంతికి మోయిన్ అలీ సింగిల్ తీయగా, మూడో బంతిలో ఒక్క పరుగు కూడా రాలేదు.
నాలుగో బంతిలో జొస్ బట్లర్ క్లీన్ బౌల్డ్
నాలుగో బంతిలో జొస్ బట్లర్ (15) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఐదో బంతిలో ఒక పరుగు లెగ్బై రూపంలో ఇంగ్లాండ్కు లభించింది. దీనితో చివరి బంతిలో ఇంగ్లాండ్ గెలవడానికి ఆరు పరుగులు అవసరమయ్యాయి. కానీ, ఆ బంతికి మోయిన్ అలీ బీట్ కావడంతో ఒక్క పరుగు కూడా లభించలేదు. భారత్ ఐదు పరుగుల తేడాతో గెలిచింది. చివరి ఓవర్ను అద్భుతంగా బౌల్ చేసిన జస్ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.