హైదరాబాద్: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ కోర్టు ధిక్కార కేసులో సుప్రీం కోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాడు. అత్యున్నత ధర్మాసనం ఘనతను తక్కువగా అంచనా వేయడం లేదా తప్పుదోవ పట్టించాలన్న ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశాడు.
'న్యాయస్థానాన్ని ధిక్కరించే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు. భాషా పరంగా, సమాచార లోపంతో అనుకోకుండా కొన్ని తప్పులు జరిగాయి. అందుకే మరోసారి భేషరుతుగా, నిస్సందేహంగా క్షమాపణలు చెబుతున్నా' అని కోర్టుకు అతని తరఫున న్యాయవాది పీఎస్ పట్వాలియా గురువారం అఫిడవిట్ను దాఖలు చేశాడు.
వివరాల్లోకి వెళితే... లోధా కమిటీ సూచించిన సంస్కరణల అమలు కోసం బీసీసీఐలో కాగ్కి చెందిన వ్యక్తిని సుప్రీంకోర్టు నియమించడం ప్రభుత్వ జోక్యం కిందకు వస్తుందా? అని అప్పట్లో బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న అనురాగ్ ఠాకూర్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి లేఖ రాశారు.
ఈ విషయం బయటికి రావడంతో ఐసీసీకి లేఖ రాశారా? అని అనురాగ్ ఠాకూర్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇందుకు అనురాగ్ ఠాకూర్ లేదని చెబుతూ తప్పుడు ప్రమాణ పత్రాన్ని సమర్పించారు. దీనిపై ఐసీసీ సీఈఓ రిచర్డ్సన్ని ప్రశ్నించగా.. బీసీసీఐ లేఖ రాసింది వాస్తమేనని అయితే ఐసీసీ ఛైర్మన్ శశాంక్ మనోహర్ ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సుప్రీంకోర్టుకి ఆయన సమాధానమిచ్చారు.
దీంతో తప్పుడు ప్రమాణ పత్రం దాఖలు చేయడంతో పాటు బీసీసీఐలో జస్టిస్ లోధా కమిటీ సూచించిన సంస్కరణలను అమలు చేసేందుకు అనాసక్తిని ప్రదర్శిస్తున్నారంటూ ఆగ్రహించిన సుప్రీం కోర్టు కోర్టు ధిక్కారం కింద విచారణను ప్రారంభించింది. ఈ విచారణను నిలిపివేయాలంటే కోర్టుకు స్వయంగా హాజరై బేషరతుగా క్షమాపణలు చెప్పాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
మళ్లీ క్షమాపణ చెప్పాల్సిందే!: అనురాగ్ ఠాకూర్కి సుప్రీం షాక్
ఆ తర్వాత మార్చిలో కోర్టును క్షమాపణ కోరుతూ అనురాగ్ అఫిడవిట్ సమర్పించాడు. అయితే ఆ అఫిడవిట్ సరిగా లేదని, దానిని పట్టించు కోవడం లేదని.. మరోసారి క్షమాపణలు దాఖలు చేయాలని కోర్టు సూచించింది. దీంతో గురువారం మరోసారి సుప్రీం కోర్టుకి అనురాగ్ ఠాకూర్ క్షమాపణ చెప్పాడు.