హైదరాబాద్: కెప్టెన్ కోహ్లీతో విభేదాల కారణంగా కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కుంబ్లే రాజీనామాతో ఏర్పడిన ఖాళీని కొత్త కోచ్తో పూరించాలని బీసీసీఐ మళ్లీ దరఖాస్తులను ఆహ్వానించింది. అంతేకాదు జులై 9 వరకు కూడా గడువుని పెంచింది.
ఈ నేపథ్యంలో కోచ్ పదవికి తాను దరఖాస్తు చేసుకుంటానని టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి చెప్పడంతో కోచ్ పదవి తననే వరిస్తుందని క్రికెట్ అభిమానులు అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత జట్టు ఫీల్డింగ్ కోచ్గా ఉన్న ఆర్ శ్రీధర్.. కుంబ్లే, శాస్త్రిల కోచింగ్ స్టయిల్స్లో ఉన్న తేడా గురించి స్పందించాడు.
జట్టులోని ఆటగాళ్ల క్యారెక్టర్ను రవిశాస్త్రి చూస్తారని, అందరూ తనలాంటి వాళ్లే ఉండాలనుకుంటాడని చెప్పాడు. అతను అలాగే పనిచేశాడని అన్నాడు. ఇక కుంబ్లే విషయానికి వస్తే జట్టులోని ఆటగాళ్లంతా తనలాగే కష్టపడాలని కోరుకుంటాడని చెప్పాడు.
అయితే ఇద్దరిలో ఎలాంటి పోలికలు లేవని, ఇద్దరిదీ ప్రత్యేకమైన శైలి అని చెప్పాడు. శ్రీధర్ మాటలను బట్టి చూస్తే.. కెప్టెన్, జట్టు ఏం చెబితే అది కుంబ్లే చేసి ఉంటే బాగుండేదని శ్రీధర్ పేర్కొన్నాడు. లీడర్ తన సామర్థ్యాన్ని బట్టి ముందుకెళ్లాలని, మార్పుని స్వీకరించాలని పేర్కొన్నాడు.
జట్టు డిమాండ్స్కు తగ్గట్టుగా వ్యవహరించి.. ప్రతి ఒక్కరి నుంచి వాళ్ల పూర్తి శక్తిసామర్థ్యాలను రాబట్టాలి అని శ్రీధర్ అన్నాడు. మంచి లీడర్ కావాలంటే మంచి ఫాలోవర్గా ఉండాలని సూచించాడు. ప్రస్తుతం ఉన్న జట్టుకు చాలా అనుభవం ఉందని, వాళ్ల అనుభవాన్ని గౌరవించి, జట్టుకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవాలని శ్రీధర్ చెప్పాడు.
ఇప్పుడున్న జట్టు రవిశాస్త్రి కోచ్గా ఉంటే హ్యాపీగా ఉంటుందా? లేక కుంబ్లేతోనా అన్న ప్రశ్నకు అతను సమాధానం దాటవేశాడు. కోహ్లీ, అతని జట్టు అవన్నీ పట్టించుకోదని, మ్యాచ్ ప్రిపరేషన్స్లో బిజీగా ఉన్నారని శ్రీధర్ చెప్పాడు. వాళ్లంతా ప్రొఫెషనల్స్. జట్టుకు ఏది అవసరమో అదే చేస్తారు. ఎవరితో ఎలా ఉండాలో, కోచ్ నుంచి ఏం కావాలో వాళ్లకు తెలుసు అని శ్రీధర్ అన్నాడు.