హైదరాబాద్: టీమిండియా ప్రధాన కోచ్ పదవికి పోటీ పెరిగిపోతోంది. ప్రధాన కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా చేసిన నేపథ్యంలో బీసీసీఐ కొత్త కోచ్ కోసం మళ్లీ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరేంద్ర సెహ్వాగ్, టామ్ మూడీ, లాల్చంద్ రాజ్పుత్, దొడ్డ గణేష్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నారు.
తాజాగా టీమిండియా మాజీ డైరెక్టర్గా పనిచేసిన రవిశాస్త్రి కూడా కోచ్ రేసులోకి వచ్చారు. ఇప్పుడు టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్ వెంకటేష్ ప్రసాద్ రేసులోకి వచ్చారు. వెంకటేష్ ప్రసాద్ ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. వెంకటేష్ ప్రసాద్ ప్రస్తుతం జూనియర్ నేషనల్ చీఫ్ సెలక్టర్గా పనిచేస్తున్నారు.
అయితే ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి తన మూడేళ్ల పదవీకాలం ముగుస్తుంది. దీంతో ఇప్పుడు ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. వెంకటేష్ ప్రసాద్ భారత్ తరఫున 33 టెస్టులు, 162 వన్డేలు ఆడాడు. అయితే దీనిపై వెంకటేష్ ప్రసాద్ అధికారికంగా మాత్రం స్పందించలేదు.
రవిశాస్త్రి దరఖాస్తు వెనుక సచిన్?
టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి కూడా తాను కోచ్ పదవికి దరఖాస్తు చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. నిజానికి రవిశాస్త్రి కొన్ని రోజుల కింది వరకు కోచ్ పదవికి దరఖాస్తు చేసేందుకు సుముఖంగా లేడు. అసలు దరఖాస్తే చేయనని చెప్పిన రవిశాస్త్రి ఉన్నట్టుండి మనసు మార్చుకోవడానికి గల కారణాలేంటి?
కోచ్ రేసులో ఆసక్తికర కోణం: శాస్త్రి అనూహ్య నిర్ణయం వెనుక సచిన్?
దీని వెనుక అసలు ఏం జరిగింది. ఉన్నపళంగా రవిశాస్త్రి కోచ్ పదవికి దరఖాస్తు చేస్తానని చెప్పడం ఆశ్చర్య పరిచింది. అందరూ అనుకుంటున్నట్లుగా ఈ మొత్తం ఎపిసోడ్కు కెప్టెన్ విరాట్ కోహ్లీయే సూత్రధారియా లేక మరెవరికైనా సంబంధం ఉందా? అంటే ఓ ఆసక్తికర కోణం బయటకు వచ్చింది. అయితే క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్... రవిశాస్త్రితో మాట్లాడి అతన్ని కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునేలా ఒప్పించినట్లు వార్తలు వస్తున్నాయి.
బీసీసీఐ వైఖరేంటి?
ఇప్పటికే సెహ్వాగ్, టామ్ మూడీతో సహా పలువురు చీఫ్ కోచ్ పదవికి దరఖాస్తులు చేశారు. ఇప్పుడు శాస్త్రి కూడా జతకావడంతో అనిల్ కుంబ్లే వారసుడిని ఎంపిక చేసే పనిలో సీఏసీ నిమగ్నమైంది. అయితే కోచ్ ఎంపికలో బీసీసీఐ వైఖరి ఎలా ఉంటుందన్నది ప్రశ్నార్థకంగా మారినా.. వివిధ కోణాల్లో అందుతున్న సమాచారాన్ని విశ్లేషిస్తే.. బోర్డు పెద్దలందరూ కోహ్లీకి మద్దతు పలికేందుకు సిద్ధంగా ఉన్నారని తేలింది. జట్టులోని సీనియర్ ఆటగాళ్లు కూడా శాస్త్రి వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో కోచ్ పదవికి రవిశాస్త్రి ఫేవరెట్గా నిలిచాడు.