హైదరాబాద్: దేశవాళీ క్రికెట్లో దిగ్గజాలుగా పేరు తెచ్చుకున్న మాజీ స్పిన్నర్లు రాజిందర్ గోయల్, పద్మాకర్ శివాల్కర్లతో పాటు భారత మహిళల జట్టు మాజీ క్రీడాకారిణి శాంత రామస్వామిలను బీసీసీఐ ఈ ఏడాది సీకే నాయుడు జీవిత కాల సాఫల్య పురస్కారానికి ఎంపిక చేసింది.
ఈ పురస్కారం పొందనున్న తొలి మహిళా క్రికెటర్గా ఆమె నిలవనున్నారు. మార్చి 8న బెంగుళూరులో జరిగే బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుకలో ఈ ముగ్గురినీ సత్కరించనున్నారు. 'గోయల్, శివాల్కర్ భారత క్రికెట్కు అందించిన సేవలకు తగిన గుర్తింపు లభించాల్సిన అవసరం ఉందని రామచంద్ర గుహ, డయానా ఎడుల్జిలతో కూడిన అవార్డుల కమిటీ అభిప్రాయపడింది' అని బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.
దేశవాళీ క్రికెట్లో శివాల్కర్ ముంబై తరుపున ఆడగా, గోయెల్ హర్యానాకు ప్రాతినిధ్యం వహించారు. గోయల్ రంజీ చరిత్రలోనే అత్యధిక వికెట్లు (637) తీసిన బౌలర్గా పేరు తెచ్చుకున్నారు. మొత్తంగా గోయెల్ 750 ఫస్ట్ క్లాస్ వికెట్లు తీసుకున్నారు. శివాల్కర్ ఆడిన 124 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 589 వికెట్లు తీయగా... ఇందులో 13 సార్లు పది వికెట్ల చొప్పున పడగొట్టారు.
బిషన్ సింగ్ బేడి తరానికి చెందిన వీళ్లిద్దరూ ఎడమచేతి వాటం స్పిన్నర్లే కావడంతో జాతీయ జట్టులో వీరికి స్ధానం లేకుండా పోయింది. 1975-76లో బేడీపై వేటు కారణంగా శివాల్కర్ జట్టులోకి వచ్చినా 12వ ఆటగాడిగా గుర్తింపు పొందారు. ఇక శాంతా రంగస్వామి 1970-80 మధ్య భారత్కు ప్రాతినిధ్యం వహించింది.
ఆమె నేతృత్వంలో భారత మహిళల జట్టు 12 టెస్టుల్లో, 16 వన్డేల్లో ఆడింది. మరోవైపు వామన్ విశ్వనాథ్ కుమార్, దివంగత రమాకాంత్ దేశాయ్లకు బీసీసీఐ ప్రత్యేకంగా అవార్డులతో సత్కరించనుంది. అవార్డులకు ముందు రోజు జరిగే ఎంఏకే పటౌడీ స్మారక ఉపన్యాసంలో మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజనీర్ ప్రసంగించనున్నారు.