1998 విల్స్ ఇంటర్నేషనల్ కప్
ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. మహమ్మద్ అజారుద్దీన్ నేతృత్వంలోని టీమిండియా సెమీస్ వరకు వెళ్లింది. ఓపెనింగ్ మ్యాచ్లో భాగంగా టీమిండియా.. ఆస్ట్రేలియాతో తలపడింది. ఈ మ్యాచ్లో సచిన్ 141 పరుగులతో సెంచరీ సాధించాడు. దీంతో టీమిండియా 8 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 48.1 ఓవర్లకు గాను 263 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 44 పరుగుల తేడాతో విజయం సాధించింది.
సెమీస్లో టీమిండియా వెస్టిండిస్తో తలపడింది. కరేబియన్ పేసర్ మెర్విన్ డిల్లన్ అద్భుత ప్రదర్శనతో టీమిండియాను 241 పరుగులకే కట్టడి చేశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ లారా(60), చందర్ పాల్ (74) పరుగులతో రాణించడంతో భారత్పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
2000 ఐసీసీ నాకౌట్ ట్రోఫీ
ఈ టోర్నీలో టీమిండియాకు కెప్టెన్ సౌరభ్ గంగూలీ. కెన్యాలో జరిగిన ఈ ట్రోఫీలో భారత్ తరుపున జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్లు అరంగేట్రం చేశారు. ఈ టోర్నీలో సౌరభ్ గంగూలీ 348 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. భారత్ తరుపున వెంకటేశ్ ప్రసాద్ 8 వికెట్లు తీసి టోర్నీ టాపర్ గా నిలిచాడు.
తోలి మ్యాచ్లో కెన్యాపై టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తన తొలి మ్యాచ్లో జహీర్ ఖాన్ 3 వికెట్లు తీయడంతో కెన్యా 9 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియాలో ద్రవిడ్ 68 పరుగులతో రాణించడంతో భారత్ విజయం సాధించింది.
2000 యువరాజ్ సింగ్ అరంగేట్రం
క్వార్టర్ ఫైనల్స్లో టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడింది. ఈ మ్యాచ్లో యువరాజ్ సింగ్ 84 పరుగులతో చెలరేగడంతో ఆసీస్ పై టీమిండియా 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.
సెమీస్లో టీమిండియా దక్షిణాఫ్రికాతో తలపడింది. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై 95 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. గంగూలీ 141 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో 50 ఓవర్లలో టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 295 పరుగులు చేసింది. ఆ తర్వాత సఫారీలు 200 పరుగులకే ఆలౌటయ్యారు.
ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్ తో తలపడింది. గంగూలో మరోసారి 117 పరుగులతో సెంచరీతో కదం తొక్కాడు. దీంతో టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ ఆల్ రౌండర్ క్రిస్ కెయిన్స్ సెంచరీతో చెలరేగడంతో టీమిండియా ఓటమి పాలైంది.
2002 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ
2003 వరల్డ్ కప్కు ఐదు నెలల ముందు శ్రీలంకలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది. ఈ టోర్నీలో కూడా కెప్టెన్ సౌరభ్ గంగూలీనే. ఈ టోర్నీలో భారత్-శ్రీలంకలను సంయుక్త విజేతలుగా ఐసీసీ ప్రకటించింది. ఈ టోర్నీలో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది.
తొలి మ్యాచ్లో జింబాబ్వేతో తలపడిన టీమిండియా 14 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. జింబాబ్వేపై మహమ్మద్ కైఫ్ వన్డేల్లో సెంచరీని సాధించాడు. ఇక రెండో మ్యాచ్లో భాగంగా
ఇంగ్లాండ్ పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో సెహ్వాగ్ 126 పరుగులతో చెలరేగాడు. ఇక గంగూలీ సైతం 117 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇంగ్లాండ్ పై అద్భుత విజయంతో టీమిండియా సెమీస్ బెర్తుని సొంతం చేసుకుంది.
దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీస్లో వీరేంద్ర సెహ్వాగ్ తన స్పిన్ బౌలింగ్లో మూడు వికెట్లు తీసి టీమిండియాకు ఘన విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్లో సఫారీలపై టీమిండియా 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఫైనల్లో టీమిండియా లంకతో తలపడింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ జరగలేదు. దీంతో ఇరు జట్లను ఐసీసీ విజేతగా ప్రకటించింది.
2004 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ
ఇంగ్లాండ్లో జరిగిన ఈ టోర్నీలో కెన్యాతో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్లో టీమిండియా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. టోర్నీలో భాగంగా పాకిస్థాన్ తో జరిగిన రెండో మ్యాచ్లో టీమిండియా పాక్ చేతిలో ఓటమి పాలైంది. ఈ టోర్నీలో గంగూలీ టీమిండియాకు మూడోసారి కెప్టెన్గా వ్యవహిరంచాడు. ఎడ్జిబాస్టన్లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓటమిపాలైంది.
2006 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ
భారత్లో జరిగిన ఈ టోర్నీలో టీమిండియా టైటిల్ విజేతగా నిలుస్తుందని అందరూ భావించారు. రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని టీమిండియాకు ఈ టోర్నీ ఓ పీడకలలాగా మారింది. టెస్టు హోదా కలిగిన పది దేశాలు ఈ టోర్నీలో పాల్గొనగా చివరకు టైటిల్ విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది.
జైపూర్లో జరిగిన ఓపెనింగ్ గేమ్ లో టీమిండియా 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆ తర్వాత వెస్టిండిస్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 3 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. మూడో మ్యాచ్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో కూడా భారత్ ఓటమిపాలైంది. దీంతో టీమిండియా టోర్నీ నుంచి తప్పుకుంది.
2009 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ
దక్షిణాఫ్రికాలో జరిగిన ఈ టోర్నీలో టీమిండియా ధోని నేతృత్వంలో బరిలోకి దిగింది. 2008లోనే పాకిస్తాన్లో ఈ టోర్నీ జరగాల్సి ఉన్నా... అక్కడి పరిస్థితుల కారణంగా టోర్నీ అక్కడ సాధ్యం కాకపోవడంతో ఏడాది ఆలస్యంగా వేదికను దక్షిణాఫ్రికాకు మార్చారు. ఈ మ్యాచ్లో భారత్ పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలవ్వడం, ఆపై వర్షంతో ఆసీస్ మ్యాచ్ రద్దు కావడంతో సెమీస్ అవకాశాలు కోల్పోయింది. షోయబ్ మాలిక్ సెంచరీ(128), మహ్మద్ యూసఫ్ హాఫ్ సెంచరీ (87)లతో రాణించడంతో పాక్ 302 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 248 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్లో రాహుల్ ద్రావిడ్ అర్ధసెంచరీ(76)తో రాణించాడు.
ఇక రెండో మ్యాచ్లో టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయింది. దీంతో టోర్నీలో టీమిండియా ఆశలు సన్నగిల్లాయి. ఆ తర్వాత వెస్టిండిస్ తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.
2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ
సుమారు నాలుగేళ్ల విరామం తర్వాత ఇంగ్లాండ్లో ఈ టోర్నీ జరిగింది. ధోని నేతృత్వంలోని టీమిండియా ఈ టోర్నీలో ఫేవరేట్గా బరిలోకి దిగింది. టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. దక్షిణాఫ్రికాపై జరిగిన తొలి మ్యాచ్లో ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీతో చెలరేగాడు. ఆ తర్వాత వెస్టిండిస్తో జరిగిన మ్యాచ్లో కూడా ధావన్ అదే మెరుపులు మెరిపించాడు.
గ్రూప్లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్తాన్లను వరుసగా ఓడించింది. ఎడ్జ్ బాస్టన్ వేదికగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భువనేశ్వర్ 8 ఓవర్లలో 19 పరుగులిచ్చి 2 వికెట్లు తీయడంతో 165 పరుగులకే పరిమితమైంది. వర్షం కారణంగా డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 19.1 ఓవర్లలో 102 పరుగులు చేసిన భారత్ మరో 17 బంతులుండగానే 8 వికెట్లతో విజయం సాధించింది. వర్షం కారణంగా 20-20 ఓవర్ల ఆట మాత్రమే జరిగిన ఫైనల్లో ఆతిథ్య దేశం ఇంగ్లండ్పై 5 పరుగులతో నెగ్గి రెండోసారి ఛాంపియన్ ట్రోపీలో విజేతగా నిలిచింది.
శ్రీలంకతో జరిగిన సెమీస్లో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అశ్విన్, ఇషాంత్ శర్మ ఇద్దరూ చెర్ మూడు వికెట్లు తీశారు. ధావన్, విరాట్ కోహ్లీలు అర్ధ సెంచరీలు చేశారు.
ఇంగ్లాండ్తో జరిగిన పైనల్ మ్యాచ్కి వరుణుడు అడ్డుపడ్డాడు. దీంతో మ్యాచ్ని 20 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 129 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ 124 పరుగులే చేయడంతో టీమిండియా 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.