హైదరాబాద్: శ్రీలంక పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్టులో వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్కి సెలక్టర్లు మొండిచేయి చూపించిన సంగతి తెలిసిందే. విశ్రాంతి పేరుతో సెలక్టర్లు యువరాజ్ సింగ్ని తప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా క్రికెటర్ గౌతమ్ గంభీర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పాడు.
భారత జట్టులోకి యువరాజ్ మళ్లీ పునరాగమనం చేయడం చాలా కష్టమని గంబీర్ పేర్కొన్నాడు. యువీని భారత సెలక్టర్లు పక్కకు పెట్టడమే కాకుండా దానిని సమర్ధించుకోవడంపై గంభీర్ మాట్లాడాడు. యువీకి విశ్రాంతినిచ్చామని చెప్పిన చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్పై గంభీర్ విమర్శలు చేశాడు.
'యువీని పక్కకు పెట్టారు. అంతవరకూ ఓకే. మరి విశ్రాంతి ఇవ్వడమేమిటి. యువరాజ్ విషయంలో రెస్ట్ అనే పదం సరికాదు. అతను చాలా రోజులుగా క్రికెట్ ఆడలేదు. టీమ్లోకి రావాలని అతను కోరుకుంటున్నాడు. అతడు వరల్డ్కప్లో ఉండాలని అనుకుంటే కచ్చితంగా టీమ్లోకి తీసుకునేవాళ్లు. యువీ లాంటి ప్లేయర్ రిథమ్ దెబ్బతీయాలని ఎవరూ అనుకోరు. అతనిలాంటి ప్లేయర్ను ఓ సిరీస్లో ఆడించి మరోదానికి పక్కన పెట్టడం సరికాదు' అని గంభీర్ చెప్పాడు.
జాతీయ జట్టుకు క్రికెట్ ఆడటానికి ఆసక్తిగానే ఉన్నప్పుడు రెస్ట్ అనే పదాన్ని ఎలా వాడతారని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ని గంభీర్ ప్రశ్నించాడు. ఒకవేళ యువీని వరల్డ్ కప్లో చూడాలని సెలక్టర్లు భావించి ఉంటే మరికొన్ని అవకాశాలు అతనికి కచ్చితంగా ఇచ్చేవారని అన్నాడు.
యువీకి తిరిగి చోటు దక్కడం కష్టమేనని గంభీర్ అన్నాడు. అయితే క్రికెట్లోని లెజెండరీ ప్లేయర్స్లో ఒకడైన యువరాజ్ తిరిగి రావాలని తాను కోరుకుంటున్నట్లు అతను చెప్పాడు. శ్రీలంక వన్డే సిరీస్కు ముందు ఆటగాళ్లకు నిర్వహించిన యో-యో ఫిట్నెస్ టెస్ట్లో యువీ ఫెయిలైన సంగతి తెలిసిందే.