హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తోన్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి గౌతం గంభీర్ మద్దతుగా నిలిచాడు. రైజింగ్ పుణె సూపర్ జెయింట్తో బుధవారం మ్యాచ్ ఆడనున్న సందర్భంగా గంభీర్ మీడియాతో మాట్లాడాడు. ఒకటి రెండు ప్రదర్శనల ఆధారంగా ధోనీని విమర్శించడం తగదని, భారత క్రికెట్కు అతను అందించిన సేవలు మర్చిపోకూడదని వ్యాఖ్యానించాడు.
ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు
'నా దృష్టిలో ఫినిషర్ అని స్టార్టర్ అని ఎవరూ ఉండరు. ఆఖరి పరుగు తీసినవాడే ఫినిషర్. అతను ఓపెనర్ కావచ్చు లేదా 11వ నంబర్ ఆటగాడు కావచ్చు. ఆటగాడు ఎలా ఆడాడన్నదే ముఖ్యం. తన జట్టు కోసం మ్యాచ్లు గెలిపించివాడే ఫినిషర్' అని గంభీర్ చెప్పాడు.
ఇక ఈ సీజన్లో బెంగళూరును 49కే ఆలౌట్ చేసి సెట్ చేసిన ట్రెండ్ కొనసాగించడం సవాల్ అని గంభీర్ అన్నాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన గంభీర్ సేన 132 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. తర్వాత కౌల్టర్నైల్, గ్రాండ్హోమ్, క్రిస్వోక్స్ తలో మూడు వికెట్లతో రాణించడంతో బెంగళూరు ఐపీఎల్లో అత్యంత తక్కువ పరుగులకే ఆలౌటైన జట్టుగా నిలిచింది.
'మా బ్యాటింగ్ను చూశాక తీవ్ర నిరాశ కలిగింది. అనంతరం ప్రత్యర్థి బ్యాటింగ్ సమయంలో జట్టు సభ్యుల నుం చి నేను దూకుడు ఆశించాను. వారు గట్టిగా పోరాడాలని, గెలిపించాలని కోరుకున్నాను. ఎవరైనా కాస్త ఉదాసీనత కనబర్చినా కోల్కతా తరఫున వారికి ఇదే ఆఖరి మ్యాచ్ అని చెప్పాను. నేను కెప్టెన్గా ఉన్నంత వరకైతే వారు మళ్లీ ఆడలేరని హెచ్చరించాను' అని గంభీర్ ఆదివారం నాటి మ్యాచ్ను గుర్తు చేసుకున్నాడు.
ఇక గెలుపుని అందుకునే ప్రయత్నంలో స్టేడియంలో ఆగ్రహావేశాలు ప్రదర్శించేందుకు తాను వెనుకాడనని, ఈ క్రమంలో ఫెయిర్ప్లే అవార్డు పాయింట్లు కోల్పోయినా తాను లెక్క చేయనని గంభీర్ వ్యాఖ్యానించాడు. తన జట్టు పాయింట్ల పట్టికలో ముందంజలో నిలవడమే తనకు ముఖ్యమని గంభీర్ తేల్చి చెప్పాడు.
'ట్రెండ్ సెట్ చేయడమే సవాల్. ఇక దాన్ని కొనసాగించడం అంతకన్నా పెద్ద సవాల్. మేము నిర్దేశించిన బెంచ్మార్క్ను కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఒక మ్యాచ్లో అలా చేయడం సులభమే. ఇప్పుడు అభిమానులు మా నుంచి ఇలాంటి ప్రదర్శనలే ఆశిస్తారు. నాతో సహా మా జట్టు సభ్యులందరూ దీన్ని గుర్తించాలనుకొంటున్నా. అది నాతోనే ప్రారంభం కావాలి. అందరూ బాగా ఆడితే బాగుంటుంది' అని అన్నాడు.