బెంగళూరు: ఐపీఎల్ ఫైనల్ మ్యాచులో ఆడే అవకాశం వచ్చిందని, తాను దీనిని వదులుకోనని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆటగాడు ఏబీ డివిల్లీయర్స్ అన్నాడు. గుజరాత్ లయన్స్తో మంగళవారం జరిగిన మ్యాచులో ఓ వైపు వికెట్లు పడుతున్నా డివిల్లీయర్స్ రెచ్చిపోయి గెలిపించిన విషయం తెలిసిందే.
బెంగళూరు తరఫున ఆరేళ్లుగా ఆడుతున్నానని చెప్పాడు. ఈ ఆరేళ్లలో రాని అవకాశం ఈసారి వచ్చిందన్నాడు. దానిని సద్వినియోగం చేసుకుంటానని చెప్పాడు. తొలిసారి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నానని, తలచుకుంటేనే చాలా ఉద్వేగంగా ఉందన్నాడు.
ఈ ఫైనల్ మ్యాచ్ తనకు చాలా విలువైనదన్నాడు. ఫైనల్లో ఆడే గౌరవం దక్కుతున్నప్పుడు దానిని సద్వినియోగం చేసుకుంటానని చెప్పాడు. జట్టు విజయానికి తోడ్పడే ప్రతి ఇన్నింగ్స్ విలువైనదేనన్నాడు. సెంచరీలు, హాఫ్ సెంచరీలు, గణాంకాల గురించి అస్సలు పట్టించుకోనని చెప్పాడు.
అవి కేవలం అంకెలేనని, అంతకంటే ఆట ఎంతో గొప్పదన్నాడు. ఆడితే అంకెలు చేరుతూ పోతాయన్నాడు. ఫైనల్ ఫలితాన్ని ఊహించలేం కానీ, జట్టులో ఆరోగ్యకరమైన వాతావరణం ఉందన్నాడు. ఐపీఎల్లో తొలి ఆరు ఓవర్లలో మంచి పరుగుల గురించి ఆలోచిస్తామన్నాడు.
నమస్కరిస్తున్నా: కోహ్లీ
గుజరాత్ లయన్స్ మ్యాచ్ సందర్భంగా డివిల్లీయర్స్ ఆడిన ఆటకు తాను వంగి నమస్కరిస్తున్నానని విరాట్ కోహ్లీ అన్నాడు. అతను అద్భుతంగా ఆడాడని చెప్పాడు. డివిల్లీయర్స్ ఆట పట్ల, మా టీం ఆట పట్ల మేం సంతృప్తిగా ఉన్నామని చెప్పారు. గవాస్కర్ మాట్లాడుతూ.. డివిల్లీయర్స్ క్రికెట్లో 'ఏబీసీడీఈ' అని కితాబిచ్చారు. ఏబీసీడీఈ అని అంటే 'ఏబీ కెన్ డు ఎవ్రీ తింగ్' అన్నాడు.