హైదరాబాద్: టీమిండియా వెటరన్ ఆటగాడు హర్భజన్ సింగ్ శుక్రవారం విశాఖపట్నంలో సందడి చేశాడు. ప్రత్యేక ఆహ్వానం మేరకు నగరంలోని ఒక స్పోర్ట్స్ షాపును సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నారులతో కొద్దిసేపు పిచ్చాపాటి మాట్లాడాడు. అనంతరం సెల్ఫీలు దిగి ఆటోగ్రాఫ్లు ఇచ్చి వారిని ఉత్సాహపరిచాడు.
బ్యాట్ పట్టుకుని బ్యాటింగ్ స్టైల్ ఫోజులిచ్చాడు. అనంతరం హర్భజన్ సింగ్ మీడియాతో మాట్లాడాడు. విశాఖ సిటీ అంటే చాలా ఇష్టమని, ఎప్పుడొచ్చినా ఇక్కడ ఆహ్లాదకర వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తానని చెప్పాడు. విశాఖ నగరం చాలా పరిశుభ్రంగా వుందని, క్లీన్ అండ్ గ్రీన్ నిర్వహణ అద్భుతమని కొనియాడాడు.
మార్చి 25 నుంచి 29 వరకు విశాఖపట్నంలోని ఏసీఏ- వీడీసీఏ స్టేడియంలో జరిగే డీబీ దేవదార్ ట్రోఫీలో ఇండియా బ్లూ జట్టుకు భజ్జీ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. నిజానికి ఇండియా బ్లూ జట్టుకు కెప్టెన్గా టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. అయితే మోకాలి గాయంతో అతను టోర్నీనుంచి తప్పుకున్నాడు.
రోహిత్ శర్మ స్ధానంలో ఇండియా బ్లూ జట్టుకు స్పిన్నర్ హర్భజన్ సింగ్ నాయకత్వం వహించనున్నాడు. మరోవైపు గాయపడిన రోహిత్ శర్మ స్ధానంలో మహారాష్ట్ర ఓపెనర్ రితురాజ్ గైక్వాడ్ను ఇండియా 'బ్లూ' జట్టులోకి తీసుకున్నారు. కాగా, ఇండియా రెడ్కు పార్థివ్ పటేల్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
ఇండియా 'రెడ్' ఆటగాడు కేదార్ జాదవ్ అనారోగ్యంతో టోర్నీకి దూరమయ్యాడు. ఇతని స్థానంలో హైదరాబాద్ లెఫ్టార్మ్ సీమర్ సీవీ మిలింద్ను ఎంపిక చేశారు. టీమిండియా ఆటగాడు శిఖర్ ధావన్ కూడా ఇండియా రెడ్లో చోటు దక్కించుకున్నాడు.
ఇండియా బ్లూ జట్టు: హర్భజన్ సింగ్(కెప్టెన్), మన్దీప్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, అంబటి రాయుడు, మనోజ్ తివారీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, రితురాజ్ గైక్వాడ్, క్రునాల్ పాండ్యా, షాబాజ్ నదీమ్, సిద్ధార్త్ కౌల్, శార్థూల్ ఠాకూర్, కృష్ణ, పంకజ్ రావ్.
ఇండియా రెడ్ జట్టు: పార్థివ్ పటేల్ (కెప్టెన్ అండ్ వికెట్ కీపర్), శిఖర్ ధావన్, మనీష్ పాండే, మయాంక్ అగర్వాల్, సీవీ మిలింద్, ఇషాంక్ జగ్గీ, గుర్కీరత్ మన్, అక్సర్ పటేల్, అక్షయ్ కామేశ్వర్, అశోక్ దిండా, కుల్వంత్ ఖేజ్రోలియా, ధావల్ కులకర్ణి, గోవింద పొద్దర్