రాజ్కోట్: భారత జట్టుకు చిరస్మరణీయ విజయాలనందించిన టీమిండియా ఆఫ్ స్పిన్నర్లు హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ల మధ్య సయోధ్య కుదిరింది. రాజ్కోట్లో ఇంగ్లాండ్ జట్టును తక్కువ పరుగులకు కట్టడి చేయడంతో టీమిండియా స్పిన్నర్లు విఫలమయ్యారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 46 ఓవర్లు వేసి 167 పరుగులు ఇచ్చాడు. దీంతో క్రికెట్ విశ్లేషకులు అశ్విన్ బౌలింగ్పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్టులో అశ్విన్ వికెట్లు తీయడానికి కష్టపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రవిచంద్రన్ అశ్విన్కు భజ్జీ మద్దతుగా నిలిచాడు.
ఫ్లాట్ పిచ్లపై వికెట్లు తీసినప్పుడే ఏ బౌలర్కైనా అసలైన మజా వస్తుందని హర్భజన్ సింగ్ అన్నాడు. రాజ్కోట్ టెస్టులో భారత స్పిన్నర్లు అశ్విన్, రవీంద్ర జడేజాలను హర్భజన్ సింగ్ వెనుకేసుకొచ్చాడు. రాజ్కోట్ టెస్టులో రెండో రోజు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు రాణించిన సంగతి తెలిసిందే.
అశ్విన్ సూపర్ బౌలరైనా ఈరోజు వాళ్లది కాదని హర్భజన్ సింగ్ చెప్పాడు. ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ 'మజా తో తబ్ హై జబ్ వికెట్స్ చాలెంజింగ్ హో(వికెట్ తప్పనిసరిగా తీయాలనుకున్న సమయంలో తీయగలిగితేనే అసలైన మజా). లైన్ విషయంలో నిలకడగా ఉండాలి. బంతితో విభిన్న రకాలుగా ప్రయత్నించాలి. అప్పుడే బౌలర్ సామర్థ్యం తెలుస్తుంది' అని భజ్జీ పేర్కొన్నాడు.
ఇక ఇంగ్లాండ్ ఆటగాళ్లు జో రూట్, బెన్ స్టోక్స్, మొయిన్ అలీలు మంచి ఆటగాళ్లని వాళ్లు చక్కగా బ్యాటింగ్ చేశారని కితాబిచ్చాడు. ఫ్లాట్ వికెట్పై బ్యాట్స్మెన్ నిలదొక్కుకున్నప్పుడు ఔట్ చేయడం మామూలు బంతులతో సాధ్యం కాదని భజ్జీ పేర్కొన్నాడు. అయినప్పటికీ భారత బౌలర్లను తక్కువగా అంచనా వేయొద్దని భజ్జీ హితవు పలికాడు.