హైదరాబాద్: ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా టెస్టు అరంగేట్రానికి ఇదే సరైన సమయమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. బుధవారం నుంచి శ్రీలంకతో గాలే వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు.
'ఆల్ రౌండర్లకు జట్టులో ఎప్పుడూ చోటుంటుంది. అదనపు ఆల్ రౌండర్ బ్యాట్స్ మెన్ ఉంటే జట్టుపై ఒత్తిడి తగ్గుతుంది. హార్దిక్ పాండ్యా లాంటి ఆటగాడు జట్టుకు నిజంగానే ఓ వరం. పరుగులు చేయడంతో పాటు కీలక సమయాల్లో వికెట్లు తీస్తాడు. దీంతో టెస్టు క్రికెట్ ఆడే మంచి అవకాశం అతడికి లభించింది. ఇది మాకు ఎంతగానో సహకరిస్తుంది. ఈ సిరిస్లో కొత్త ప్రణాళికలతో ముందుకు వెళతాం. మా ప్రధాన బౌలర్లు వికెట్లను ఎలా తీస్తారనేదే ఇక్కడ ముఖ్యం' అని కోహ్లీ అన్నాడు.
ఇక రోహిత్ శర్మను టెస్టుల్లో ఓపెనర్గా వినియోగించుకునే విషయమై కోహ్లీ మాట్లాడుతూ 'టెస్టు క్రికెట్లో రోహిత్ శర్మ ఎప్పుడూ ఓపెనర్గా దిగలేదు. అయితే రోహిత్ను ఓపెనర్గా పంపి ప్రయోగాలు చేయలేం. ఎందుకంటే ఓపెనింగ్ కోసమే మన జట్టులో స్పెషల్ బ్యాట్స్మెన్లు ఉన్నారు' అని కోహ్లీ పేర్కొన్నాడు.
ఇక భారత జట్టులో ఆటగాళ్ల మధ్య బలం దృఢంగా ఉందని కోహ్లీ అన్నాడు. ప్లేయర్ల మధ్య బంధం బలంగా ఉందని, దాని పట్ల గర్వంగా ఉందని, క్రికెట్ గేమ్లో ఉన్న ప్రత్యేకమైన అంశం అదే అని కోహ్లీ తెలిపాడు. దురదృష్టవశాత్తు ఫ్లూ జ్వరం వల్ల కేఎల్ రాహుల్ తొలి టెస్టుకి దూరం అవుతున్నట్లు కోహ్లీ చెప్పాడు.
కేఎల్ రాహుల్ జట్టులో కీలక ఆటగాడు అని, గతంలోనూ అతను అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ఇక పాండ్యా వికెట్లు తీసుకునే బౌలర్ అని, ఎటువంటి పిచ్పైన అయినా అతను వికెట్లు తీసుకోగలడు అని కోహ్లీ అన్నాడు.