పాకిస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డ పాండ్యా
72 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి టీమిండియా పీకలోతు కష్టాల్లో ఉన్న సమయంలో పాండ్యా క్రీజులోకి వచ్చాడు. క్రీజులోకి వచ్చి రాగానే తనదైన శైలిలో పాకిస్థాన్ బౌలర్లపై విరుచుకు పడ్డాడు. అయితే రవీంద్ర జడేజాతో సమన్వయ లోపం కారణంగా రనౌట్ అయ్యాడు.
పాండ్యాని రనౌట్ చేసిన జడేజా
నాన్ స్ట్రయికర్ ఎండ్లో ఉన్న పాండ్యా రన్ కోసం ముందుకు వచ్చినా జడేజా సరైన సమయంలో వారించలేదు. ఇంతలోనే మనసు మార్చుకున్న జడేజా వెనక్కి పరుగు తీశాడు. దీంతో ఇద్దరూ ఒకే ఎండ్కు వచ్చారు. మొదట క్రీజులో బ్యాట్ పెట్టిన జడేజా నాట్ట్ కాగా, నాన్ స్ట్రయికింగ్ ఎండ్లో బెయిల్స్ పడగొట్టడంతో.. సిక్సర్లతో పాక్ బౌలర్లపై విరుచుకుపడుతున్న పాండ్యా తీవ్ర నిరాశతో పెవిలియన్ బాట పట్టాడు.
32 బంతుల్లో అర్ధసెంచరీ
32 బంతుల్లోనే 3 సిక్సర్లు, 3 ఫోర్లతో హాఫ్ సెంచరీ చేసి ఐసీసీ టోర్నీల్లోనే ఫైనల్లో వేగంగా అర్ధ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచిన హార్దిక్ (43 బంతుల్లో 76; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) రనౌట్ కావడమే అభిమానులను ఎక్కువగా బాధించింది. దీనిపై సోషల్ మీడియాలో కొందరు తీవ్రంగా విమర్శిస్తే.. మరికొందరు సరదాగా జడేజాపై జోకులు పేల్చారు.
జడేజాపై ట్విట్టర్లో జోకులు
‘సర్' బిరుదును జడేజా పేరు ముందు నుంచి తొలగించాలని బాంబే హైకోర్టు అనధికారికంగా ఆదేశించిందని ఒకరు పోస్టు చేశారు. నమ్మినోడే ముంచాడు అనే విధంగా బాహుబలిని కట్టప్ప చంపినట్టుగా గ్రాఫిక్స్తో తమ ఆక్రోశం వెళ్లగక్కాడు. భారీ గదతో ఓ వ్యక్తి జడేజా అడ్రస్ కోసం వెదుకుతున్నట్టు చేసిన పోస్టింగ్లు నెట్లో చక్కర్లు కొడుతున్నాయి.