మెల్బోర్న్: భారత్ వన్డే, ట్వంటీ 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆదివారం నాడు అసహనానికి లోనయ్యాడు. ధోనీ ఇటీవల వరుసగా విఫలమవుతున్నాడు. దీనిపై విలేకరులు ప్రశ్నించగా... నా కెప్టెన్సీ పైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) వేయాలని నవ్వుతూనే చురకలు వేశాడు.
'నా కెప్టెన్సీని నేనే సమీక్షించుకోవడం మొదలు పెడితే అది విరుద్ధ ప్రయోజనాల కిందికి వస్తుందనుకుంటా. బహుశా ఇందుకోసం కోర్టులో పిల్ వేస్తే మేలు. ఇప్పుడు కెప్టెన్గా నేనున్నా. రేపు నా స్థానంలో మరొకరు రావొచ్చు. అయితే విషయం కెప్టెన్సీ గురించి కాద'ని అన్నాడు.
ఏయే విభాగాల్లో విఫలమవుతున్నామో తెలుసుకుని మెరుగుపడటం ముఖ్యమని, తమ బౌలర్లకు పెద్దగా అనుభవం లేదని, ఇషాంత్ శర్మ వన్డే జట్టులో స్థిరంగా ఆడలేదని, ఉమేష్ యాదవ్ వస్తూ పోతున్నాడని, మిగిలినవాళ్లు ఇప్పుడిప్పుడే అరంగేట్రం చేశారని చెప్పాడు.
కాబట్టి వాళ్లు ఎలా మెరుగుపడుతున్నారన్నది మేం చూడాలన్నాడు. ప్రస్తుతం భారత బ్యాట్స్మెన్లో విరాట్ కోహ్లి అత్యుత్తమమని, భవిష్యత్తులో అతడు చాలా కీలకమవుతాడని కితాబిచ్చాడు. సుదీర్ఘ కాలం జట్టును ముందుకు నడిపించగల ఆటగాడు కోహ్లీ అన్నాడు.
మూడు మ్యాచ్లు హోరాహోరీగానే సాగాయిని, తమ బౌలర్ల పైన ఒత్తిడి ఉన్న విషయం వాస్తవమేనని, అయితే మూడో వన్డేలో బౌలర్లు బాగానే రాణించారని,. ఫీల్డింగ్లో వైఫల్యమే మమ్మల్ని దెబ్బతీసిందని చెప్పాడు.
భారత్ సెంచరీలపై మాక్స్వెల్ చురకలు
భారత బ్యాట్స్మెన్ మైలురాళ్ల కోసం ఆడుతున్నట్లున్నారని, సెంచరీలు చేసి అందరి దృష్టిలో పడొచ్చు.. కానీ తనకు జట్టు గెలవడమే ముఖ్యమని గ్లెన్ మాక్స్వెల్ అన్నాడు. వన్డేల్లో సెంచరీల కోసం ఆసిస్ ఆటగాళ్లు పాకులాడరని, అవి బ్యాట్స్మెన్ గణాంకాలను మాత్రమే మెరుగుపరుస్తాయన్నాడు.
ఓ ఆటగాడు సెంచరీ సాధించాలని జాగ్రత్తగా ఆడుతూ పోతే జట్టుకు 40 నుంచి 50 పరుగులు నష్టం జరగొచ్చునని, అది ఫలితం మీద ప్రభావం చూపిస్తుందని, భారత్కు అదే సమస్య అని మాక్స్వెల్ చెప్పాడు. చాలా వరకు ఉపఖండ జట్ల ఇలానే ఉన్నాయన్నాడు.
తాము ఐదు వన్డేల సిరీస్ను 5-0తో వైట్ వాష్ చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. అలాగే ట్వంటీ 20 సిరీస్లోను మూడు మ్యాచులు గెలుస్తామని తద్వారా 8-0తో భారత్ను ఇంటి దారి పట్టిస్తామని మాక్స్వెల్ చెప్పాడు.