కోల్కతా: సొంతగడ్డపై కోల్కతా అదరగొట్టింది. చెపాక్లో సూపర్కింగ్స్ చేతిలో పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. రసెల్ ఆల్రౌండ్ జోరుకు, ఉతప్ప మెరుపులు తోడవడంతో.. ఈడెన్ గార్డెన్స్లో గంభీర్ సేన విజయతీరాలకు చేరింది. గురువారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో గంభీర్ సారథ్యంలోని కోల్కతా 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్కింగ్స్ను మట్టికరిపించింది.
రాబిన్ ఉతప్ప (80 నాటౌట్; 58 బంతుల్లో 7ఫోర్ల, 1సిక్స్), 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' రస్సెల్(55 నాటౌట్; 32 బంతుల్లో 4ఫోర్లు, 4సిక్సులు) రెచ్చిపోవడంతో 166 పరుగుల లక్ష్యాన్ని కోల్కతా.. 19.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
మొదట కోల్కతా నైట్రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు దిగిన చెన్నై మొదటి బంతిలోనే స్టీవెన్ స్మిత్ వికెట్ను కోల్పోయింది. అతను పాట్ కమిన్స్ బౌలింగ్లో ర్యాన్ టెన్ డస్కట్కు చిక్కాడు. ఫస్ట్డౌన్లో వచ్చిన సురేష్ రైనా రెండో వికెట్కు ఓపెనర్ బ్రెండన్ మెక్కలమ్తో కలిసి 43 పరుగులు జత చేశాడు. 10 బంతుల్లో 8 పరుగులు చేసిన అతను ఉమేష్ యాదవ్ బౌలింగ్లో పీయూష్ చావ్లాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
కేవలం 12 బంతులు ఎదుర్కొని, మూడు ఫోర్లు, మరో మూడు సిక్సర్లతో 32 పరుగులు చేసి, ప్రమాదకరంగా కనిపించిన మెక్కలమ్ను బ్రాడ్ హాగ్ ఎల్బిగా ఔట్ చేశాడు. అదే ఓవర్లో అతను ఫఫ్ డు ప్లెసిస్ను రాబిన్ ఉతప్ప క్యాచ్ పట్టగా పెవిలియన్ చేర్చాడు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నాలుగు బంతుల్లో ఒక పరుగు చేసి, పీయూష్ చావ్లా బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. 32 బంతుల్లో 30 పరుగులు చేసిన డ్వెయిన్ బ్రేవోను ఆండ్రె రసెల్ బౌల్డ్ చేశాడు.
19వ ఓవర్ను బౌల్ చేసిన హాగ్ తొలుత రవీంద్ర జడేజా (24)ను కమిన్స్ క్యాచ్ పట్టగా ఔట్ చేశాడు. అదే ఓవర్లో పవన్ నేగీ (27)ని క్లీన్ బౌల్డ్ చేశాడు. మోహిత్ శర్మ తొలి బంతికే ఔటయ్యాడు. ఉతప్ప క్యాచ్ అందుకోగా రసెల్ అతనిని పెవియలిన్ దారి పట్టించాడు. చివరిరలో ఆశిష్ నెహ్రా (1), రోనిత్ మోరె (2) నాటౌట్గా నిలిచారు. చెన్నై 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. కోల్కతా బౌలర్లలో హాగ్ 29 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టాడు. రసెల్కు రెండు వికెట్లు లభించాయి.
166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన కోల్కతా, 33 పరుగుల వద్ద గౌతం గంభీర్ వికెట్ను కోల్పోయింది. అతను 16 బంతుల్లో 19 పరుగులు చేసి, మోహిత్ శర్మ బౌలింగ్లో రోనిత్ మోరెకు దొరికాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన మనీష్ పాండే క్రీజ్లో నిలదొక్కుకోలేకపోయాడు. 10 బంతుల్లో కేవలం మూడు పరుగులు చేసిన అతను నేగీ బౌలింగ్ జడేజాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ రెండు పరుగులకే మోరే బౌలింగ్లో డ్వెయిన్ బ్రేవోకి క్యాచ్ ఇచ్చాడు.
అనంతరం రాబిన్ ఉతప్ప, ఆండ్రె రసెల్ కలిసి 13.3 ఓవర్లలో జట్టు స్కోరును 100 పరుగులకు చేర్చారు. ఆశిష్ నెహ్రా వేసిన 15వ ఓవర్ మొదటి బంతిని భారీ సిక్స్గా మలచిన ఉతప్ప అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఆ వెంటనే వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. దీంతో రన్రేట్ వేగాన్ని పుంజుకుంది. తర్వాతి ఓవర్ను జడేజా వేయగా, రసెల్ ఓ సిక్స్, మరో ఫోర్ బాదాడు. ఆ ఓవర్లో నైట్ రైడర్స్కు 14 పరుగులు లభించాయి.
డ్వెయిన్ బ్రేవో వేసిన ఓవర్లో రెండు భారీ సిక్సర్లుకొట్టిన రస్సెల్ చేయాల్సిన రన్రేట్ను భారీగా తగ్గించడంతోపాటు అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. మ్యాచ్ చివరి ఓవర్కు చేరుకున్నప్పుడు నైట్ రైడర్స్ విజయానికి ఆరు పరుగుల దూరంలో నిలిచింది. కెరీర్లో తొలిసారి ఐపిఎల్ మ్యాచ్ ఆడిన రోనిత్ మోరే చివరి ఓవర్ వేశాడు. మొదటి రెండు బంతుల్లో రెండు పరుగులు లభించాయి. మూడో బంతిలో ఉతప్ప రెండు పరుగులు చేశాడు.
నాలుగో బంతికి ఒక సింగిల్ సాధించాడు. ఐదో బంతిని రసెల్ ఫోర్గా మార్చి, నైట్ రైడర్స్కు ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. మరో బంతి మిగిలి ఉండగా, నైట్ రైడర్స్ 3 వికెట్లకు 169 పరుగులు చేసింది.