హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ స్టేడియంలో బౌలింగ్ చేయడాన్ని తాను ఎంతగానో ఆస్వాదిస్తానని టీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పష్టం చేశాడు. (ఫిబ్రవరి 9) గురువారం నుంచి బంగ్లాదేశ్తో ఏకైక టెస్టు మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా అశ్విన్ మీడియాతో మాట్లాడాడు. 'ఈ పిచ్పై బౌన్స్ బాగుంటుంది. దాంతో పాటు ఇది పెద్ద గ్రౌండ్ కూడా. ఈ తరహా పిచ్ నాకు లాభిస్తుందనే ఆశిస్తున్నా. ఇక్కడ బంతి పెద్దగా టర్న్ కాకపోయినా, ఊహించని బౌన్స్ వస్తుంది. అది స్పిన్నర్లకు అనుకూలమనే చెప్పొచ్చు' అని అశ్విన్ తెలిపాడు.
కాగా, బంగ్లాదేశ్ జట్టును ఏ మాత్రం తేలిగ్గా తీసుకున్న తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అశ్విన్ హెచ్చరించాడు. బంగ్లాదేశ్ కూడా మెరుగైన జట్టు అనే విషయాన్ని మరువకూడదని టీమిండియా పూర్తిస్థాయి ప్రదర్శన చేయాల్సి ఉందని పేర్కొన్నాడు.
న్యూజిలాండ్ పర్యటనను పూర్తి చేసుకున్న బంగ్లా నేరుగా టీమిండియాతో ఏకైక టెస్టు ఆడేందుకు భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బంగ్లాదేశ్ జట్టును తక్కువగా అంచనా వేయకూడదని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
గతేడాది ఫతుల్లాలో జరిగిన మ్యాచ్లో అశ్విన్ బంగ్లాపై ఐదు వికెట్లు తీసుకుని భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ టెస్టులో కూడా అదే సీన్ రిపీట్ చేయాలనే అశ్విన్ భావిస్తున్నాడు. బంగ్లాతో టెస్టుకు పూర్తిగా సన్నద్ధమైనట్లు అశ్విన్ పేర్కొన్నాడు.