ఇండోర్: తనను ఎంతగానో ఆదరించే అభిమానులు ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉందని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించారు. మైదానం, జిమ్ లేదా ట్రైనింగ్ సెషన్స్లో సోషల్ మీడియాలో ఎప్పుడూ అభిమానులతో టచ్లో ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకరు.
అంతేకాదు కొత్త కొత్త హెయిర్ స్టైల్స్తో పాటు పలు జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. న్యూజిలాండ్తో ఇండోర్లో జరిగిన మూడో టెస్టు మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్లో కోహ్లీ అభిమానులనుద్దేశించి మాట్లాడారు. టీమ్ బస్సులో నుంచి అభిమానులకు పలకరించడం తనకు ఎంతో సంతోషంగా ఉంటుందని పేర్కొన్నాడు.
అందరిలాగే తాను కూడా మనిషేనని చెప్పాడు. అయితే అభిమానులు తనకు మరోలా కనెక్ట్ అయ్యారని పేర్కొన్నాడు. అభిమానులు నాపై పెట్టుకున్న నమ్మకమే అలా ఉందని తెలిపాడు. టీమ్ బస్సులో నుంచి ఉదయం వేళల్లో అభిమానులకు చేతులు ఊపడాన్ని తానెంతగానో ఇష్టపడతానని చెప్పుకొచ్చాడు.
ఎందుకంటే అలా చేయడం ద్వారా అభిమానులు ఎంతగానో ఆనందిస్తారని తెలిపాడు. తద్వారా ఉదయం పూట తన మూడ్ కూడా ఎంతో బాగుంటుందని కోహ్లీ తెలిపాడు. వాటిని తాను ఒత్తిడిగా భావించనని, ఆశీర్వాదంగా భావిస్తానని పేర్కొన్నాడు. నేను దానిని ఇష్టపడతాను. అభిమానులు స్వచ్చమైన మనసుతో మనల్ని ఆనందపరిచినప్పుడు వాటిని మనస్ఫూర్తిగా మనం కూడా స్వీకరించాలని తెలిపాడు.
అంతేకాదు ఆ దీవెనలు మనల్ని మరింతగా ఉత్తేజపరుస్తాయని తెలిపాడు. కాగా, విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా టెస్టు క్రికెట్లో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్తో జరిగిన మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్ను 3-0తేడాతో విజయం సాధించింది.
దీంతో టెస్టుల్లో టీమిండియా నెంబర్ వన్ స్థానాన్ని చేజిక్కించుకున్న నేపథ్యంలో మూడో టెస్టు మ్యాచ్ ముగిసిన అనంతరం కోహ్లీ ఐసీసీ ప్రతిష్ఠాత్మకంగా అందించే గదను అందుకున్నాడు. ఈ సందర్భంగా కోహ్లి ట్విటర్ వేదికగా 'నా సోదరులతో కలిసి ఇది మరిచిపోలేని క్షణం.. అద్భుత విజయం, ఐసీసీ గద సాధించడం, టెస్టుల్లో నంబర్ వన్ స్థానం దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉంది. సహచర ఆటగాళ్ల వల్ల నేనెంతో గర్వంగా ఫీలవుతున్నా'నంటూ ట్వీట్ చేశాడు.