సాధించలేని విషయాల గురించి మాట్లాడదలచుకోలేదు
ప్రాణాంతక క్యాన్సర్ను జయించి యువరాజ్ సింగ్ టీమిండియాలోకి పునరాగమనం చేసిన సంగతి తెలిసిందే. 'సాధించలేని విషయాల గురించి మాట్లాడదలచుకోలేదు. ప్రస్తుతం బాగా ఆడుతున్నాను. ఈ ఫామ్నే కొనసాగించాలనుకుంటున్నా. ఎన్నో అవరోధాలు ఎదురైనా 300వ వన్డే ఆడబోతున్నా. ఇందుకు గర్వంగా ఉంది' అని యువీ చెప్పాడు.
ఓ దశలో ఇక మళ్లీ ఆడలేనేమో బాధపడ్డాను
'ఓ దశలో ఇక మళ్లీ ఆడలేనేమో బాధపడ్డాను. ఇప్పుడు ఇక్కడున్నా. మంచి ప్రదర్శనలు చేస్తున్నా. మరికొన్నేళ్లు ఇలాగే ఆడతా. మెరుగ్గా ఆడుతున్నంతకాలం క్రికెట్లో కొనసాగుతాను. నాలో గొప్ప గుణం. చివరి వరకు పోరాడడం. ఎంతటి అడ్డంకి ఎదురైనా సరే. ముందుకు సాగడం. కుర్రాళ్లకు నా సందేశం కూడా ఇదే. వెనక్కి తగ్గకండి. సాఫీగా సాగుతున్నప్పుడైనా, అడ్డంకులు ఎదురైనపుడైనా ఒకే తీవ్రతతో సాధన చేయండి' అని యువరాజ్ తెలిపాడు.
నేను రోల్ మోడల్నో కానో తెలియదు
ఇక, భారత జట్టులోకి రావడం, దేశం తరఫున ఆడడం అంత కష్టమేమీ కాదని కాకపోతే.. 17 ఏళ్లు కొనసాగాలంటే మాత్రం పట్టుదల అవసరమని యువరాజ్ చెప్పాడు. 300 వన్డేల మైలురాయి తనకు గొప్ప విషయమని యువీ చెప్పాడు. ‘నేను రోల్ మోడల్నో కానో తెలియదు కానీ 300 వన్డేలు నాకు గొప్ప విజయం. గౌరవం. కెరీర్ ప్రారంభించినప్పుడు భారత్ తరఫున ఒక్క మ్యాచ్ ఆడితే చాలనుకున్నా. కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశా. వాటిని దాటి 300వ మ్యాచ్కు చేరుకున్నందుకు గర్వపడుతున్నా' అని యువీ అన్నాడు.
నా అత్యుత్తమ ప్రదర్శన అదే
కాగా, తన వన్డే కెరీర్లో 2011 వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై (57, 2/44) ప్రదర్శన అత్యుత్తమమని ఈ సందర్భంగా యువరాజ్ అన్నాడు. తర్వాత అత్యుత్తమంగా 2000లో నైరోబిలో ఆస్ట్రేలియాపై ఆడిన ఇన్నింగ్స్ను పేర్కొన్నాడు. ఇంతలో జర్నలిస్ట్లు నాట్వెస్ట్ ఫైనల్ గురించి ప్రస్తావించగా, అది కూడా తన కెరీర్లో మరపురాని ఇన్నింగ్స్లో ఒకటని యువీ తెలిపాడు.
వయసు మీద పడుతున్న క్రికెటర్లు మరింత కష్టపడాలి
ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో వయసు మీద పడుతున్న క్రికెటర్లు మరింత కష్టపడాలని యువీ పేర్కొన్నాడు. 'మూడేళ్ల నుంచి దేశవాళీ క్రికెట్ ఆడుతున్నా. పెళ్లి సమయంలో తప్ప ఎప్పుడూ ఒక్క మ్యాచ్కు కూడా దూరం కాలేదు. అందుకే మళ్లీ జట్టులోకి రాగలిగాను' అని యువరాజ్ చెప్పాడు.