హైదరాబాద్: బీసీసీఐ తీరుపై ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ధర్మశాల వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన చివరి టెస్టులో మూడో రోజు ఆటలో భాగంగా ఆసీస్ వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే.
దీంతో వేడ్-జడేజాల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియోను బీసీసీఐ వెబ్సైట్లో ఉంచింది. దీనిపై ఆసీస్ కెప్టెన్ స్మిత్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆటలో ఆటగాళ్ల మధ్య ఇలాంటి సంఘనటలు చోటు చేసుకోవడం మామూలు విషయమే అని మ్యాచ్ ముగిసిన అనంతరం స్మిత్ అన్నాడు.
ఈ తరహా సంఘటనలకు సంబంధించిన వీడియోలను అందుబాటులో ఉంచడం మంచి పద్ధతి కాదని, ఈ సిరీస్లో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయని స్టీవ్ స్మిత్ అన్నాడు. అసలేం జరిగిందంటే... [జడేజాను కవ్వించిన వేడ్: ఏం సమాధానం చెప్పాడో తెలుసా?]
నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజాను ఆసీస్ కీపర్ మాథ్యూ వేడ్ మాటలతో కవ్వించాడు. రవీంద్ర జడేజా ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించాడు. 248/6 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్ కొనసాగించిన భారత్కు సాహా-జడేజా జోడి చక్కని ఆరంభాన్ని ఇచ్చింది.
102 ఓవర్లకు గాను టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 37, సాహా 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా స్కోరుని సమం చేయాలంటే టీమిండియా 16 పరుగుల వెనుకంజలో ఉంది. ఈ సమయంలో ఆసీస్ స్పిన్నర్ లియాన్ వేసిన 103వ ఓవర్లో కీపర్ మాథ్యూవేడ్.. జడేజాను కవ్వించాడు.
'ఏమైంది ఎందుకలా ఆడుతున్నావు.. ఇక్కడికెందుకు వస్తున్నావు' అని అన్నాడు. దీంతో వెంటనే రవీంద్ర జడేజా అంపైర్ దగ్గరికి వెళ్లి 'అతడు (వేడ్) ఆపకపోతే నేను మొదలుపెట్టాల్సి వస్తుంది' అని చెప్పాడు. మ్యాచ్ అనంతరం వేడ్తో జరిగిన సంభాషణను జడేజా బయటపెట్టాడు.
'ఏమీ జరగలేదు. మీరు ఓడిపోయాక అంతా కలిసి డిన్నర్ చేద్దాం' అని వేడ్తో అన్నట్టు జడేజా తెలిపాడు. నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరిస్లో 25 వికెట్లు తీసిన జడేజాను మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డు కూడా వరించింది. ఈ సిరిస్లో మొత్తం 127 పరుగులు చేసిన జడేజా అందులో రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి.