హైదరాబాద్: ఇంగ్లాండ్పై చేసిన ట్రిపుల్ సెంచరీయే తన జీవితంలో అత్యుత్తమ ఇన్నింగ్స్ అని టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కరుణ్ నాయర్ అన్నాడు. ఐదో టెస్టులో 381 బంతుల్లో 32 ఫోర్లు 4 సిక్సర్ల సాయంతో 303 నాటౌట్ గా నిలిచి సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ చేసిన భారత బ్యాట్స్మన్గా రికార్డు నెలకొల్పాడు.
చెలరేగాడు: యంగెస్ట్ క్రికెటర్గా కరుణ్ నాయర్ చరిత్ర
ఐదో టెస్టు నాలుగో రోజు సోమవారం మ్యాచ్ ముగిసిన అనంతరం నాయర్ మీడియాతో మాట్లాడాడు. సెంచరీ చేశాక తాను ఒత్తిడిగా భావించలేదని చెప్పాడు. సెంచరీ అనంతరం తనదైన శైలిలో షాట్లు ఆడానని తెలిపాడు. తానాడిన మ్యాచ్లను చాలా వరకు నాన్న చూస్తారని పేర్కొన్నాడు. తన ఆట చూశాక అమ్మానాన్న గర్వపడి ఉంటారని చెప్పాడు.
తన జీవితంలో ఇదే అత్యుత్తమ ఇన్నింగ్స్ అని తెలిపాడు. ట్రిపుల్ సెంచరీ చేసే క్రమంలో భిన్న పరిస్థితులు ఉన్నాయని చెప్పాడు. కేఎల్ రాహుల్, అశ్విన్, జడేజాలతో కలసి ఆడానని చెప్పిన నాయర్ తాను క్రీజులో పాతుకుపోవడానికి వారు సహకరించారని... వారికి ధన్యవాదాలు తెలిపాడు.
ఈ సందర్భంగా నాయర్ తన జీవితంలోని ఓ ఆసక్తికర సంఘటనను గుర్తు చేసుకున్నాడు. తనకు ఈత రాని సమయంలో కేరళలో జరిగిన బోటు ప్రమాదంలో నీళ్లలో పడిన సందర్భాన్ని చెప్పుకొచ్చాడు. అక్కడి స్థానికులు తనను నీళ్ల నుంచి బయటకు తీసి రక్షించారని, వాళ్లే లేకుంటే తాను ఈరోజు మీ ముందు ఈ ఇన్నింగ్స్ ఆడేవాడిని కాదని చెప్పాడు.
తన తండ్రి తన మ్యాచ్లను చూడడం తనకు ఎలాంటి ఒత్తిడి కలిగించలేదని అన్నాడు. మరోవైపు తమ కొడుకు ఈ ఘనత సాధించడం తమకు గర్వంగా ఉందని నాయర్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మళయాళీ కుటుంబానికి చెందిన కరుణ్ నాయర్ రాజస్థాన్లోని జోధ్పూర్లో జన్మించాడు.
తండ్రి కళాధరన్ మెకానికల్ ఇంజినీర్కాగా.. తల్లి ప్రేమ నాయర్ స్కూల్ టీచర్. వృత్తిరీత్యా కళాధరన్ కొన్ని రోజులు రాజస్థాన్లో ఉన్నారు. ఆ తర్వాత బెంగళూరుకు మారారు. టెస్టు క్రికెట్లో వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ చేసిన భారత బ్యాట్స్ మన్గా నాయర్ రికార్డు నెలకొల్పాడు.
ప్రస్తుతం రంజీల్లో కర్ణాటక జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న నాయర్ చెన్నై టెస్టులో 303 నాటౌట్గా నిలిచాడు. తద్వారా ట్రిపుల్ సెంచరీ సాధించిన యంగెస్ట్ క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు.