హైదరాబాద్: బీసీసీఐ అధ్యక్ష పదవి రేసులో తానున్నానంటూ వచ్చిన వార్తలను టీమిండియా మాజీ కెప్టెన్, క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఖండించాడు. బీసీసీఐ పదవికి తాను ఇప్పుడే అర్హుడిని కాననీ, అనవసరంగా తన పేరు తెరపైకి తెస్తున్నారని గంగూలీ అసహనం వ్యక్తం చేశాడు.
ప్రస్తుతం తాను క్యాబ్ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నానని లోధా కమిటీ ప్రకారం తాను బీసీసీఐ అధ్యక్ష పదవికి అర్హుడిని కాదని అన్నాడు. ''నా పేరు అనవసరంగా తెరపైకి వచ్చింది. నేను బీసీసీఐ అధ్యక్ష పదవికి అర్హుణ్ని కాదు. క్యాబ్ అధ్యక్షుడిగా ఒక ఏడాది పూర్తయింది. ఇంకో రెండేళ్లు గడువుంది. బీసీసీఐ అధ్యక్ష పదవికి రేసులో లేను'' అని గంగూలీ చెప్పాడు.
సర్వత్రా ఆసక్తి: బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరభ్ గంగూలీ?
మరోవైపు లోధా కమిటీ సిఫారసులను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్)లో అమలు చేస్తారా? అన్న ప్రశ్నకు సుప్రీం కోర్టు తీర్పుని తప్పక పాటిస్తామని తెలిపాడు. బుధవారం క్యాబ్ ఆఫీస్ బేరర్లతో సమావేశం ఏర్పాటు చేశామని భవిష్యత్తు నిర్ణయాన్ని ప్రకటిస్తామని గంగూలీ తెలిపాడు.
లోధా కమిటీ ఇచ్చిన సిఫారసులు అమలు చేయలేదనే కారణంతో బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేను సుప్రీం తొలగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీసీసీఐ కొత్త అధ్యక్షుడు ఎవరు? అనే దానిపై ఆసక్తి నెలకొంది. సుప్రీం తీర్పు నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్ష రేసులో గంగూలీ పేరు తెరపైకి వచ్చింది.
బీసీసీఐ అధ్యక్ష బరిలో టీఎస్ మాథ్యూ, గౌతమ్ రాయ్లు లాంటి వారి పేర్లు వినిపిస్తున్నా సౌరభ్ గంగూలీ పేరే ప్రధానంగా వినిపించింది. మరోవైపు బోర్డు పూర్తి స్థాయి కార్యవర్గం కోసం ఈ నెల 19న కేసు తదుపరి విచారణ సందర్భంగా ఆదేశాలిస్తామని సుప్రీం కోర్టు పేర్కొంది.
కొత్త బాస్గా గంగూలీ: ఆ అర్హత ఉందన్న గవాస్కర్
తనపై వచ్చిన వార్తలను గంగూలీ ఖండించాడు. ఇదిలా ఉంటే ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డుగా పేరున్న బీసీసీఐని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అయితేనే సమర్ధవంతంగా నడపగలడని పలువురు క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.