హైదరాబాద్: బీసీసీఐ రోజువారీ కార్యకలాపాలు చూసేందుకు నలుగురు సభ్యులతో కూడిన ఓ కమిటీని సుప్రీం కోర్టు నియమించింది. ఈ కమిటీ సభ్యులలో కాగ్ మాజీ చీఫ్ వినోద్ రాయ్, ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ, ఐడీఎఫ్సీ అధికారి విక్రమ్ లిమాయె, మహిళ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీలు ఉన్నారు.
ఈ కమిటీకి వినోద్ రాయ్ సారథ్యం వహిస్తారు. ఈ మేరకు సోమవారం సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం తీర్పు అనంతరం క్రికెట్ ఆసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ జర్నలిస్టులతో మాట్లాడుతూ గత కొంతకాలం నుంచి సాగుతున్న బీసీసీఐ ఎపిసోడ్ చూస్తూ తాను అలిసిపోయానని అన్నారు.
అయితే కమిటీ సభ్యులపై స్పందించమని కోరగా ఇది సుప్రీం కోర్టు నియమించిన కమిటీ అని, ఆ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందేనని గంగూలీ పేర్కొన్నాడు. జస్టిస్ ఆర్ ఎమ్ లోధా కమిటీ సిఫారసుల ప్రకారం కొత్త ఆఫీసు బేరర్ల ఎన్నికలు జరిగేంత వరకు బీసీసీఐ కార్యకలాపాలను ఈ కమిటీ పర్యవేక్షించనుంది.
ఈ కమిటీలో కేంద్ర క్రీడల శాఖ మంత్రిని సభ్యుడిగా నియమించాలన్న కేంద్ర ప్రభుత్వ విన్నపాన్ని సుప్రీం కోర్టు తిరస్కరించింది. మంత్రులు, ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న వారు బీసీసీఐ పాలకులుగా అనర్హులని చెప్పిన తీర్పును సుప్రీం ప్రస్తావించింది. కమిటీ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఫిబ్రవరి మొదటి వారంలో ఐసీసీ సమావేశానికి బీసీసీఐ తరుపున జాయింట్ సెక్రెటరీ అమితాబ్ చౌదరి, విక్రమ్ లిమాయేలు ప్రాతినిధ్యం వహిస్తారని సుప్రీం కోర్టు వెల్లడించింది. కొత్త కమిటీలో టీమిండియా మాజీ క్రికెటర్లకు కానీ, బోర్డు మాజీ అధికారులకు సుప్రీం చోటు కల్పించలేదు. కేవలం మాజీ టీమిండియా మాజీ కెప్టెన్ డయానాకు చోటు కల్పించింది.
ఇక బీసీసీఐ సీఈఓ ప్యానెల్కు రిపోర్ట్ చేయాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. బీసీసీఐ, అనుబంధ సంఘాల్లో లోధా సిఫారసుల అమలుపై నివేదికను అడ్మినిస్ట్రేషన్ ప్యానెల్.. నాలుగు వారాల్లో కోర్టుకు సమర్పించనుందని ధర్మాసనం తెలిపింది. అమికస్ క్యూరీ గోపాల సుబ్రమణియమ్, సీనియర్ న్యాయవాది అనిల్ ధవన్, కొన్ని రాష్ట్ర సంఘాల తరఫు న్యాయవాది కపిల్ సిబల్లు సీల్డ్ కవర్లో ఇచ్చిన పేర్ల నుంచి ప్యానెల్ సభ్యులను కోర్టు ఎంపిక చేసింది.