మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత
మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇంగ్లాండ్తో ప్రస్తుతం జరుగుతున్న మూడు వన్డేల సిరిస్కు యువరాజ్ సింగ్ ఎంపికైన సంగతి తెలిసిందే. పూణెలో జరిగిన తొలి వన్డేలో నిరాశపరిచినప్పటికీ, కటక్లో జరిగిన రెండో వన్డేలో సెంచరీతో రాణించి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు.
రెండో వన్డేలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు
దీంతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. రెండో వన్డేలో యువరాజ్ సింగ్ 127 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 150 పరుగులు సాధించాడు. తద్వారా 2004లో ఆస్ట్రేలియాపై సాధించిన 139 పరుగుల స్కోరును యువరాజ్ అధిగమించాడు.
ఆరేళ్ల తర్వాత సెంచరీ చేసిన యువరాజ్
2011లో చివరిసారిగా వరల్డ్ కప్లో సెంచరీ సాధించిన యువరాజ్ మళ్లీ ఆరేళ్ల తర్వాత సెంచరీని సాధించాడు. యువీతో పాటు మరో వెటరన్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. యువీకి తన సహకారాన్ని అందిస్తూనే ధోని కూడా సెంచరీని పూర్తి చేశాడు.
2-0 తేడాతో సిరిస్ కైవసం
ధోని కూడా 2013లో ఆస్ట్రేలియాపై చివరిసారిగా సెంచరీ చేశాడు. వీరిద్దరి జోడీ రాణించడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. 382 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 8 వికెట్లు కోల్పోయి 366 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్పై 15 పరుగుల తేడాతో విజయం సొంతం చేసుకుంది. దీంతో మూడు వన్డేల సిరీస్ను కోహ్లీ సేన 2-0 తేడాతో కైవసం చేసుకుంది.