హైదరాబాద్: భవిష్యత్తులో టీమిండియా ప్రధాన కోచ్ పదవికి ధరకాస్తు చేస్తానని ఆస్ట్రేలియా మాజీ బౌలర్ జాసన్ గిలెస్పీ స్పష్టం చేశాడు. టీమిండియా కొత్త కోచ్గా రవిశాస్త్రి ఎంపికైన నేపథ్యంలో అతడికి శుభాకాంక్షలు చెబుతూ తన మనసులోని మాటను బయట పెట్టాడు.
'టీమిండియా కోచ్ అనేది చాలా పెద్ద జాబ్. దానిని సాధించినందుకు రవిశాస్త్రికి అభినందనలు తెలియజేస్తున్నా. కొన్ని సంవత్సరాల్లో ఏదో ఓ రోజు నేను ఈ పదవి చేపట్టడం గురించి తీవ్రంగా పరిశీలిస్తా' అని గిలెస్పీ అన్నాడు. 42 ఏళ్ల గిలెస్పీ టీమిండియా కోచ్ పదవికి ఈ సారి దరఖాస్తు చేయాలో వద్దో నిర్ణయించుకోలేక పోయానని అన్నాడు.
దీని గురించి తన కుటుంబంతో చాలా చర్చించానని తెలిపాడు. భవిష్యత్తులో ఏదో ఓ రోజు కచ్చితంగా సాధిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. 'నాకు కూడా భారత జట్టుకు కోచ్ గా చేయాలని ఉంది. ఈసారి అందుకోసం దరఖాస్తు చేసే అంశంపై సరైన నిర్ణయం తీసుకోలేకపోయా. దీనిపై కుటుంబ సభ్యులతో చాలా తీవ్రంగా చర్చించాను' అని గిలెస్పీ అన్నాడు.
'అయితే నిర్ణయం తీసుకోవడంలో విఫలమయ్యా. భవిష్యత్తులో టీమిండియా కోచ్ పదవికి దరఖాస్తు చేసే అంశాన్ని చాలా సీరియస్గా పరిగణిస్తా. ఏదొక రోజు భారత క్రికెట్ కోచ్ అవుతాననే నమ్మకం కూడా ఉంది' గిలెస్పీ పేర్కొన్నాడు. 1996 నుంచి 2006 వరకూ ఆసీస్ విజయాల్లో గిలెస్పీ అద్భుత పాత్ర పోషించాడు.
ఆస్ట్రేలియా తరుపున 71 టెస్టు మ్యాచ్ల్లో 259 వికెట్లు సాధించిన గిలెస్పీ, 97 వన్డేలాడి 142 వికెట్లు తీశాడు.