బెంగుళూరు: ఈ ఏడాది జూన్లో టీమిండియా నుంచి డ్రాప్ అయిన తర్వాత కొన్ని నెలల పాటు క్రికెట్కు దూరంగా ఉన్నట్లు ఆల్ రౌండరైన రవీంద్ర జడేజా మంగళవారం చెప్పాడు. 'రాక్స్టార్' జడేజా నాలుగు నెలలు పాటు జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు.
వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో జరగనున్న టెస్టు సిరిస్ కోసం నిన్న (అక్టోబర్ 19)న తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. 26 ఏళ్ల రవీంద్ర జడేజా సౌరాష్ట్ర తరుపున రంజీ ట్రోఫీలో అత్యంత అధ్భుతంగా రాణించాడు.
రంజీ ట్రోఫీలో జడేజా ఆడిన రెండు మ్యాచ్ల్లో రెండు అర్ధ సెంచరీలు సాధించడంతో పాటు లీడింగ్ వికెట్ టేకర్గా ఉన్నాడు. రంజీ ట్రోఫీలో అత్యుత్తమ ఆటతీరుని కనబర్చిన రవీంద్ర జడేజాకు సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ దక్షిణాఫ్రికాతో జరగనున్న తొలి రెండు టెస్టు మ్యాచ్ల్లో ఆడేందుకు అవకాశం కల్పించారు.
విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టెస్టు జట్టులో భజ్జీ స్థానంలో రవీంద్ర జడేజా చోటు దక్కించుకున్నాడు. ఈ ఏడాది జూన్లో బంగ్లాదేశ్తో జరిగిన వన్డేలో చివరిసారిగా జడేజా టీమిండియా తరుపున ఆడాడు. బీసీసీఐ వెబ్సైట్కి ఇచ్చిన ఇంటర్యూలో రవీంద్ర జడేజా తన మనసులోని మాటను వెల్లడించాడు.
జింబాబ్వే పర్యటన అనంతరం జట్టులో స్ధానం కోల్పోయిన తాను కొన్ని నెలలు పాటు క్రికెట్కు దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. క్రికెట్కు దూరంగా తన మనసుని పెట్టి, ఇతర పనుల్లో బిజీగా గడిపానని తెలిపాడు. తన ఫాంహౌస్లోని గుర్రం, స్నేహితులతో కాలక్షేపం చేసినట్లు తెలిపాడు.
అనంతరం రంజీ సీజన్ మొదలు కాగానే తిరిగి ఎలాగైనా సరే జట్టులో చోటు దక్కించుకోవాలనే కసితో ఆడినట్లు తెలిపాడు. అందుకోసం జిల్లా స్థాయి మ్యాచ్లను సైతం ఆడాడని చెప్పిన జడేజా, రంజీ మ్యాచ్ల్లో సత్తా చాటానని పేర్కొన్నాడు.
రంజీల్లో సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహించిన జడేజా ఆడిన రెండు మ్యాచ్ల్లో చెలరేగి పోయిన సంగతి తెలిసిందే. త్రిపురతో జరిగిన తొలి మ్యాచ్ లో 11 వికెట్లు తీసి సౌరాష్ట్ర గెలుపులో కీలకపాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
అనంతరం జార్ఖండ్తో జరిగిన మ్యాచ్లో 13 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలంటే ఐదు లేదా ఆరు నెలలపాటు మనమెంటే నిరూపించుకోవాల్సి ఉంటుందన్నారు. కాగా, దక్షిణాఫ్రికాతో జరగనున్న నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్లో తొలి టెస్టు నవంబర్ 5 నుంచి మొహాలిలో ప్రారంభం కానుంది.