మొహాలీ: ప్రపంచ కప్ హీరో, క్యాన్సర్ను జయించిన భారత ఆల్రౌండర్ యువరాజ్ సింగ్.. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న 17మంది చిన్నారులకు భరోసా ఇచ్చాడు. వ్యాధిని జయించాలని వారికి ధైర్యాన్నిచ్చాడు. వారితో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో యువరాజ్ పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా పలువురు చిన్నారులు పలు ప్రశ్నలు అడిగారు. మరోసారి ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొడతారా? అని యువీని చిన్నారులు ప్రశ్నించారు. 'మీరు అలా కోరుకుంటే.. నేను తప్పకుండా ఆరు సిక్సులు మరోసారి కొడతా' అని యువీ బదులిచ్చాడు.
తాను ఆరు సిక్సులు ఎలా కొట్టాననేది తనకే తెలియదని అన్నాడు. చాలా సంవత్సరాలు గడిచిపోయాయని తెలిపాడు. కాగా, దక్షిణాఫ్రికాలో 2007లో జరిగిన ట్వంటీ20 ప్రపంచ కప్ మ్యాచ్లో ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో వరుసగా ఆరు సిక్సులను బాదిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.
తనకు 18 నెలలు ఉన్న సమయంలోనే క్యాన్సర్ వ్యాధి సోకిందని, ఇప్పుడు తనకు 8ఏళ్లని ఓ బాలుడు చెప్పాడు. తాను 4వ తరగతి చదువుతున్నట్లు తెలిపాడు. యువరాజ్ లాంటి గొప్ప ఆటగాడు తనకు స్ఫూర్తి అని అతడు పేర్కొన్నాడు.
'నాకు క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. యువరాజ్, రైనా ఆటను చూస్తూ ఆనందిస్తా' అని చెప్పాడు. క్యాన్సర్ లాంటి వ్యాధి మనల్ని ఏమీ చేయలేదని చిన్నారులకు యువీ భరోసా ఇచ్చాడు. మన వెంటే కుటుంబసభ్యులు, స్నేహితులు ఉన్నారని చెప్పాడు.
వ్యాధి నుంచి పూర్తి కోలుకుని కొత్త జీవితం ప్రారంభించాలని కోరుకుంటున్నట్లు యువరాజ్ వారికి చెప్పాడు. 2011 ప్రపంచ కప్ టోర్నీని టీమిండియా సాధించడంలో కీలక పాత్ర పోషించిన యువీ.. తర్వాత క్యాన్సర్ వ్యాధితో కొంతకాలం క్రికెట్కు దూరమయ్యాడు. ఆ తర్వాత క్యాన్సర్ నుంచి పూర్తి కొలుకుని మళ్లీ క్రికెట్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఆదివారం రాత్రి కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో యువరాజ్ సింగ్. 24 బంతుల్లోనే 42 పరుగులు చేసి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. 7వికెట్ల తేడాతో పంజాబ్పై హైదరాబాద్ గెలిచింది.