హైదరాబాద్: ఐసీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసిన శశాంక్ మనోహర్ తన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు. గత వారంలో ఐసీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసి ఆ లేఖను సీఈఓ రిచర్డ్ సన్కు సమర్పించిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం ఆ పదవిలో కొనసాగేందుకు ఆయన అంగీకరించాడు.
ఐసీసీ ఛైర్మన్ పదవికి శశాంక్ మనోహార్ రాజీనామా
ఏప్రిల్ నెలలో కీలకమైన ఐసీసీ సమావేశాలు ఉన్న తరుణంలో ఛైర్మన్ హోదాలో తిరిగి కొనసాగాలని ఆయన నిర్ణయించుకున్నాడు. మనోహర్ ఆకస్మిక రాజీనామాపై ఐసీసీలోని కొందరు సభ్యులు వ్యతిరేకించారు. ఇందులో భాగంగానే ఏప్రిల్లో జరిగే సమావేశాలు వరకూ మనోహర్ చైర్మన్గా కొనసాగాలని పట్టుబట్టారు.
ఈ నేపథ్యంలో తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న మనోహర్ మరికొన్ని రోజులు ఆ పదవిలో కొనసాగేందుకు అంగీకరించాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం చైర్మన్ లేని పక్షంలో ఎగ్జిక్యూటివ్ బోర్డు నేతృత్వంలో తాత్కాలిక చైర్మన్ను నియమిస్తుంది. తదుపరి బోర్డు మీటింగ్ జరిగే వరకు ఆయనకు చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తుంది.
దీంతో మనోహర్ను చైర్మన్గా కొనసాగాలంటూ సభ్యులు విన్నపాన్ని గౌరవంగా భావించిన ఆయన మరికొంత కాలం తాత్కాలిక హోదాలో కొనసాగేందుకు అంగీకరించాడు. 'ఐసీసీ డైరెక్టర్ల సెంటిమెంట్ ను నేను గౌరవించే ఆ పదవిలో కొనసాగేందుకు ఒప్పుకున్నా. నాపై నమ్మకంతో వారు మరికొంతకాలం కొనసాగమని అడిగారు. దాంతో మరికొంత కాలం ఆ పదవిలో ఉంటా. తదుపరి బోర్డు మీటింగ్ వరకూ చైర్మన్ పదవిలో ఉంటా. నేను వ్యక్తిగత కారణాలతోనే ఆ పదవికి గుడ్ బై చెప్పా. ఈ నిర్ణయంలో అయితే ఎటువంటి మార్పులేదు' అని ఒక ప్రకటనలో ఆయన తెలిపారు.