హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గురువారం ది ఓవల్ వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్కి ఓ ప్రత్యేకత ఉంది. ఇరు జట్లకు ఇది 150వ అంతర్జాతీయ వన్డే కావడం విశేషం.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
అంతర్జాతీయ క్రికెట్లో రెండు దేశాలు 150 వన్డేల్లో తలపడటం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ మ్యాచ్లో శ్రీలంక చేతిలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఇరు జట్ల ఆడిన 150 మ్యాచ్ల్లో టీమిండియా 83 మ్యాచుల్లో గెలవగా శ్రీలంక 55 మ్యాచుల్లో విజయం సాధించారు.
ఈ రెండు జట్ల మధ్య ఒక మ్యాచ్ టైగా ముగియగా, ఫలితం తేలని మ్యాచ్లు 11 ఉన్నాయి. మొట్టమొదటిసారి టీమిండియా 1985లో శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఈ పర్యటనలో ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరిస్ జరగ్గా 1-1తో టైగా ముగిసింది.
ఇక ఛాంపియన్స్ ట్రోఫీ విషయానికి ఇరు జట్లు నాలుగు సార్లు తలపడ్డాయి. 2013లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించగా, ప్రస్తుత టోర్నీలో శ్రీలంక విజయం సాధించింది. ఇక మిగతా రెండు మ్యాచ్లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి.
ఈ రెండు మ్యాచ్లు కూడా 2002లో శ్రీలంక ఆతిథ్యమిచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీలో చోటు చేసుకున్నాయి. అంతేకాదు భారత్, శ్రీలంక జట్లు 10 దేశాల్లో వన్డేలను ఆడాయి. ఇదే ఇప్పటివరకు అత్యధికం. ఈ వన్డే సిరిస్లలో ద్వైపాక్షిక, ముక్కోణపు సిరిస్లు సైతం ఉన్నాయి.
భారత్, శ్రీలంక జట్లు ఇప్పటివరకు వెస్టిండిస్, ఇంగ్లాండ్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా, యూఏఈ, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా దేశాల్లో వన్డే మ్యాచ్లు ఆడాయి. ఒక్క న్యూజిలాండ్లో మాత్రమే ఈ రెండు దేశాలు ఇప్పటివరకు వన్డే మ్యాచ్ ఆడలేదు. ఇరు దేశాల మధ్య ఇప్పటికే పలుమార్లు ద్వైపాక్షిక సిరిస్లు జరిగాయి.