హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ జోరు కొనసాగుతోంది. టోర్నీలో హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ అంచనాలకు తగ్గట్టుగా ప్రదర్శనే చేస్తోంది. టోర్నీలో వరుసగా రెండో విజయం సాధించి సెమీస్కు అర్హత సాధించింది.
కార్డిఫ్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై 87 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో, 4 పాయింట్లతో సెమీస్ బెర్తు సాధించింది. గ్రూప్-ఎలో మిగతా జట్లలో 4 పాయింట్లు సాధించే అవకాశం ఒక్క ఆస్ట్రేలియాకు మాత్రమే ఉండటంతో ఇంగ్లాండ్కు సెమీస్ బెర్తు ఖాయమైంది.
రెండో సెమీస్ బెర్తు కోసం మిగతా మూడు జట్లూ రేసులో ఉన్నాయి. ఈ గ్రూప్ ఏలో మ్యాచ్ల్లో ఇంకా ఆస్ట్రేలియా (2 పాయింట్లు)తో ఇంగ్లాండ్ తలపడాల్సి ఉంది. మరోవైపు ఇదే గ్రూపులో ఉన్న బంగ్లాదేశ్ (1 పాయింట్)తో న్యూజిలాండ్ (1 పాయింట్) తలపడనుంది. ఇంగ్లాండ్తో జూన్ 10 (శనివారం) జరిగే మ్యాచ్లో ఆసీస్ గెలిస్తే రెండో సెమీస్ బెర్తు ఆ జట్టుదే అవుతుంది.
311 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్కు మంచి అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఓపెనర్ రాంకి (0) ఆరంభంలోనే వెనుదిరిగినా.. మరో ఓపెనర్ గప్తిల్ (27), రాస్ టేలర్ (39)లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పారు.
ఇక కెప్టెన్ కేన్ విలియమ్సన్ (87; 98 బంతుల్లో 8 ఫోర్ల)తో చక్కని పోరాటం చేశాడు. అతడు ఉన్నంత సేపు కివీస్ లక్ష్యం వైపు సాగింది. 30 ఓవర్లకు 158/2తో కివీస్ లక్ష్యం దిశగా సాగింది. ఆ తర్వాత విలియమ్స్ నిష్క్రమణతో అంతా మారిపోయింది.
ఇంగ్లాండ్ బౌలర్లు వరుసగా వికెట్లు తీసి కివీస్ను లక్ష్యానికి దూరం చేశారు. దీంతో కివీస్ 44.3 ఓవర్లలో 223 పరుగులకే ఆలౌటైంది. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' జేక్ బాల్ (2/31), ప్లంకెట్ (4/55), రషీద్ (2/47) ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
న్యూజిలాండ్ విజయ లక్ష్యం 311
అంతకముందు ఇంగ్లాండ్ 49.3 ఓవర్లలో 310 పరుగులు చేసి అలౌటైంది. దీంతో న్యూజిలాండ్కు 311 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఒకానొక దశలో ఇంగ్లాండ్ తడబడినా ఆ తర్వాత ఇంగ్లిష్ బ్యాట్స్మెన్ సమష్టిగా చెలరేగారు.
ఇంగ్లాండ్ ఆటగాళ్లలో జో రూట్ (64; 65 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులు), జోస్ బట్లర్ (61 నాటౌట్; 48 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులు), అలెక్స్ హేల్స్ (56; 62 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులు) పరుగులతో అర్ధసెంచరీలు చేయగా, బెన్స్టోక్స్ (48; 53 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సులు) పరుగులతో ఆకట్టుకున్నాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ ఆదిలోనే జాసన్ రాయ్(13) వికెట్ను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన జో రూట్... హేల్స్కు జత కలిసి ఇన్నింగ్స్ను కొనసాగించాడు. వీరిద్దరూ 81 పరుగులు జోడించిన తరువాత హేల్స్ రెండో వికెట్గా పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాత కెప్టెన్ మోర్గాన్(13) కూడా పెవిలియన్ చేరడంతో ఇంగ్లాండ్ 134 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో జోరూట్-బెన్ స్టోక్స్ బాధ్యతాయుతంగా ఆడి ఇంగ్లాండ్ స్కోరు బోర్డుని పరిగెత్తించారు. ఆ తర్వాత ఇంగ్లాండ్ వరుసగా వికెట్లు కోల్పోయినా చివరి వరకు నిలకడగా ఆడుతూ జోస్ బట్లర్ (61) నాటౌట్గా నిలిచాడు.
న్యూజిలాండ్ బౌలర్లలో కోరీ అండర్సన్, మిల్నే తలో మూడు వికెట్లు సాధించగా, సౌథీకు రెండు వికెట్లు, బౌల్ట్, సాంత్నార్ లకు చెరో వికెట్ తీశారు.
టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా మంగళవారం గ్రూప్ ఏలో ఉన్న ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. కార్డిఫ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేయనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాతో బరిలోకి దిగిన జట్టే ఈ మ్యాచ్లో కూడా ఆడుతుందని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. ఇంగ్లాండ్ జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. గాయంతో ఛాంపియన్స్ టోర్నీకి దూరమైన క్రిస్ వోక్స్ స్ధానంలో అదిల్ రషీద్కు తుది జట్టులో చోటు దక్కింది.
ఈ మ్యాచ్కి కూడా వర్షం అడ్డంకిగా మారే సూచనలు ఉన్నాయి. పాయింట్ల పట్టికలో ఒక గెలుపుతో ఇంగ్లాండ్ మొదటి స్థానంలో ఉండగా, న్యూజిలాండ్ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇంతకు ముందు వర్షం కారణంగా ఆసీస్, కివీస్ మ్యాచ్ నిలిపేయడంతో చెరో పాయింట్ లభించింది. కివీస్ సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్లో తప్పక గెలవాలి. ఇక బంగ్లాదేశ్పై గెలిచిన ఇంగ్లాండ్ ఉత్సాహంతో ఉంది.
జట్ల వివరాలు:
ఇంగ్లాండ్:
జేసన్ రాయ్, అలెక్స్ హేల్స్, జో రూట్, ఇయాన్ మోర్గాన్ (కె), బెన్స్టోక్స్, బట్లర్, మొయిన్ అలీ, ఆదిల్ రషీద్, లియామ్ ప్లంకెట్, మార్క్వుడ్, జేక్ బాల్
న్యూజిలాండ్:
మార్టిన్ గప్తిల్, ల్యూక్ రాంకీ, కేన్ విలియమ్సన్ (కె), రాస్ టేలర్, నీల్ బ్రూమ్, జేమ్స్ నీషమ్, కోరె అండర్సన్, మిచెల్ శాంట్నర్, ఆడమ్ మిల్నే, టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్