హైదరాబాద్: జూన్ 18తో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన సంగతి తెలిసిందే. ఫైనల్లో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడగా, భారత్పై పాకిస్థాన్ 180 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఛాంపియన్స్గా అవతరించింది. దీంతో టోర్నీ విజేతగా నిలిచిన పాకిస్థాన్ రూ.14.18 కోట్లు ప్రైజ్ మనీని అందుకుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
ఇక రన్నరప్గా నిలిచిన టీమిండియాకు రూ.7 కోట్లు ప్రైజ్ మనీ లభించింది. టోర్నీ ముగిసిన అనంతరం ఐసీసీ నిర్వాహకులు పోటీలో పాల్గొన్న 8 జట్లకు ప్రైజ్ మనీని అందించారు. 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీతో పోలిస్తే ఈ ఏడాది జట్లకు కాస్త ఎక్కువగానే అందించినట్లు ఐసీసీ వర్గాలు తెలిపాయి.
టోర్నీలో భాగంగా లీగ్ దశలో జరిగిన కొన్ని మ్యాచ్లు వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. దీంతో గ్రూప్-ఎలో ఉన్న జట్లు న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్లు పాయింట్లు పంచుకున్నాయి. కాగా, హ్యాట్రిక్ విజయాలతో ఇంగ్లాండ్ తొలి సెమీఫైనల్ బెర్తు ఖాయం చేసుకుంది.
అయితే సెమీస్లో పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలై ఇంటిదారి పట్టింది. ఇక గ్రూప్-బిలో ఉన్న భారత్, పాకిస్థాన్, శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. తొలి మ్యాచ్లో భారత్ చేతిలో ఓటమి చవిచూసిన పాక్ ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని వరుస విజయాలతో టైటిల్ విజేతగా నిలిచింది.
ఛాంపియన్స్ ట్రోఫీలో జట్లు అందుకున్న ప్రైజ్మనీ వివరాలివే:
విజేతగా నిలిచిన పాకిస్థాన్కు రూ. 14.18 కోట్లు
రన్నరప్గా నిలిచిన భారత్కు రూ. రూ.7 కోట్లు
ఇంగ్లాండ్ - రూ.3కోట్లు
బంగ్లాదేశ్ - రూ.3కోట్లు
ఆస్ట్రేలియా - రూ.58లక్షలు
దక్షిణాఫ్రికా - రూ.58లక్షలు
శ్రీలంక - రూ.39లక్షలు
న్యూజిలాండ్ - రూ.39లక్షలు
పాకిస్థాన్ జట్టుకు భారీ నజరానాలు:
ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న పాకిస్థాన్ జట్టుకు ఆ దేశ ప్రభుత్వం భారీ నజారానాలు ప్రకటించారు. ప్రధాని నవాజ్ షరీఫ్ జట్టులోని ఒక్కో ఆటగాడికి కోటి రూపాయల నజరానా ప్రకటించారు. సెంట్రల్ కాంట్రాక్టుల మేరకు ఇప్పటికే జట్టుకు 2.90 కోట్ల రూపాయల బోనస్ ప్రకటించిన పీసీబీ.. ఒక్కో క్రికెటర్కు అదనంగా మరో 10 లక్షలు ఇవ్వనున్నట్టు వెల్లడించింది.
ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్నందుకు పాక్కు రూ. 14.18 కోట్ల ప్రైజ్మనీ లభించిన సంగతి తెలిసిందే. ప్రఖ్యాత బిల్డర్ రియాజ్ మాలిక్ ఒక్కో ఆటగాడికి రూ. 10లక్షతో పాటు ఓ ప్లాట్ కూడా ఇవ్వనున్నట్టు ప్రకటించాడు.