లంకను కట్టడి చేయడంతో బౌలర్లు విఫలం
ఛేదనకు దిగిన శ్రీలంకను కట్టడి చేయడంతో బౌలర్లు విఫలమయ్యారు. మ్యాచ్ ఓటమి అనంతరం విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. 'మా బౌలర్లను ఎంతగానో నమ్మాను. 322 పరుగులంటే సాధారణ లక్ష్యమేం కాదు. బౌలర్లు ఎలాగైనా గెలిపిస్తారని భావించాను. కానీ అలా జరగలేదు. శ్రీలంక అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. వారి టైమింగ్ తో పాటు షాట్ సెలక్షన్ కూడా బాగుంది. పాక్పై రాణించిన బౌలర్లు ఈ మ్యాచ్లో పూర్తిగా తేలిపోయారు' అని అన్నాడు.
నిరాశే ఎదురైందని చెప్పిన కోహ్లీ
'లంకేయులు బ్యాట్తో చక్కని ప్రదర్శన చేయడమే ఇందుకు కారణమని భావిస్తున్నాను. కుషాల్ మెండిస్ (89), ధనుష్క గుణతిలక (76)లు మా నుంచి మ్యాచ్ను దూరం చేశారు. మూడొందలకు పైచిలుకు స్కోరును కాపాడుకుంటామని భావించినా నిరాశే ఎదురైంది' అని పేర్కొన్నాడు.
లంక జట్టులో ప్రతి ఒక్కరూ పాజిటివ్ క్రికెట్ను ఆడారు
లంకతో జరిగిన మ్యాచ్లో మా బౌలర్లు తమ ఆలోచనకు మరిత పదను పెడితే ఈ పరిస్థితి తలెత్తేది కాదని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. లంక జట్టులో ప్రతి ఒక్కరూ పాజిటివ్ క్రికెట్ను ఆడారని కోహ్లీ కొనియాడాడు. లంక చేతిలో ఓటమి పాలవ్వడంతో టీమిండియా సెమీస్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది.
దక్షిణాఫ్రికాపై నెగ్గితేనే భారత్ సెమీస్కు
భారత్ తమ చివరి మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై నెగ్గితేనే సెమీస్ చేరుతుంది. గ్రూప్ బిలో భాగంగా భారత్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు చెరో మ్యాచ్ నెగ్గడంతో.. ఇంకో మ్యాచ్ నెగ్గిన రెండు జట్లు సెమీస్ చేరతాయి. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ రసవత్తరంగా మారింది.