దుబాయ్: ఐసీసీ సోమవారం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ను ప్రకటించింది. తాజాగా ప్రకటించిన ఈ టెస్టు ర్యాంకింగ్స్లో ఆస్టేలియాకు చెందిన స్టీవ్ స్మిత్ మొదటి స్ధానంలో నిలిచాడు. జూన్ 14న వెస్టిండిస్తో ముగిసిన టెస్టు సిరిస్లో స్టీవ్ స్మిత్ అద్భుతంగా రాణించి 913 పాయింట్లతో ప్రపంచంలోనే నెంబర్ వన్ స్ధానంలో నిలిచాడు.
వెస్టిండిస్లో జరిగిన టెస్టు సిరిస్లో ఆస్టేలియా వైట్ వాష్ చేసింది. 2-0తో వెస్డిండిస్పై ఆసీస్ విజయం సాధించింది. 26ఏళ్ల స్టీవ్ స్మిత్ అధ్బుతమైన ఫామ్లో కొనసాగుతున్నాడు. 17 టెస్టు మ్యాచ్ల్లో 9 సెంచరీలు సాధించాడు.
కింగ్స్టన్లో జరిగిన పైనల్ టెస్టు మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని సొంతం చేసుకున్నాడు. టెస్టు ర్యాంకింగ్స్ జాబితాలో శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర రెండో స్ధానంలో నిలవగా, దక్షిణాఫ్రికాకు చెందిన ఏబీ డెవిలియర్స్ మూడో స్ధానంలో నిలిచాడు.
టాప్ ఫైవ్లో దక్షిణాఫ్రికాకు చెందిన హాసీం ఆమ్లా, శ్రీలంకకు చెందిన ఏంజెలో మ్యాథ్యూస్ ఉన్నారు. టాప్ 10 జాబితాలో ఒక్క ఇండియన్ కూడా లేకపోవడం విశేషం. టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ 11వ స్ధానంలో ఉండగా, ఓపెనర్ మురళీ విజయ్ 20వ స్ధానంలో కొనసాగుతున్నాడు.
ఇక బౌలర్స్లో దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ నెంబర్ వన్ స్ధానంలో కొనసాగుతుండగా, టాప్ 10లో ఒక్క ఇండియన్ కూడా చోటు దక్కించుకోలేదు. 12వ స్ధానంలో రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు.