దుబాయ్: టోర్నీ ఏదైనా టీమిండియా, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే ఎప్పుడూ ఉద్వేగభరితంగానే సాగుతుంది. అందులోనూ పెద్దపెద్ద టోర్నమెంట్లలో ఈ రెండు జట్లు తలపడుతున్నాయంటే స్టేడియాలు కిటకిటలాడాల్సిందే. టీవీ రేటింగ్స్ పెరిగిపోవాల్సిందే.
కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ను ఐసిసి బుధవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. 2017, జూన్ 4న ఇంగ్లాండ్లోని ఎడ్గ్బాస్టన్ మైదానంలో భారత్ తన తొలి మ్యాచ్ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తోనే ప్రారంభించనుంది. కాగా, ఈ మ్యాచ్ జరగనున్న ప్రాంతంలో ఆసియాకు చెందిన వారి జన సంఖ్య అధికంగా ఉంటారు. దీంతో స్టేడియం కిటకిటలాడే అవకాశం లేకపోలేదు.
ఇది ఇలా ఉండగా, కావాలనే ఈ రెండు జట్లను ఒకే గ్రూపులో ఉండేలా డ్రాలను కొద్దిగా అటూ ఇటూ చేసినట్లు ఐసీసీ పేర్కొంది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్లు ఉండేలా చూడాలనే తాము ప్రయత్నిస్తామని, అందులో అనుమానం అక్కర్లేదని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్సన్ చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తుంటారని, అలాంటి మ్యాచ్తో టోర్నీ ప్రారంభమైతే మంచి ఊపు వస్తుందని ఆయన అన్నారు. ఒక టోర్నమెంటు గ్రూప్ దశలోనే భారత్, పాక్ జట్లు తలపడటం వరుసగా ఇది ఐదోసారి.
ఈ రెండు జ్టల మధ్య మ్యాచ్లను టీవీలలో దాదాపు వందకోట్ల మంది చూస్తారని అంచనా. కావాలనే డ్రా ఇలా వేయడం వల్ల టోర్నమెంటు సమగ్రతను కోల్పోతుందన్న వ్యాఖ్యలను రిచర్డ్సన్ ఖండించారు.
గ్రూపుల్లో ఉన్న దేశాల ర్యాంకులను కలిపి చూస్తే.. రెండు గ్రూపుల పాయింట్లు సమానంగా ఉన్నాయన్నారు. రెండింటి మధ్య సరితూకం ఉన్నంతవరకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని చెప్పారు. కాగా, గ్రూప్ బిలో భారత్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, పాకిస్థాన్ జట్లు ఉండగా, గ్రూప్ ఏలో ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి.