మ్యాచ్ ముగిసిన తర్వాత అందరం ఏడ్చేశాం
మ్యాచ్ ముగిసిన తర్వాత తమ జట్టు సభ్యులందరం ఏడ్చేశామని ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్మన్ ప్రీత్ చెప్పింది. ‘మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆతిథ్య ఇంగ్లాండ్ చేతిలో 9 పరుగుల తేడాతో ఓడిపోయాం. విజయానికి అతి చేరువగా వచ్చి ఓటమి పాలయ్యాం. ఇది జట్టు మొత్తాన్ని కలచివేసింది. అందరం ఏడ్చేశాం. మ్యాచ్ గురించి అందరం చర్చించుకున్నాం' అని తెలిపింది.
మమ్ముల్ని ఏడవవద్దని చెప్పారు
‘జట్టు సహాయక సిబ్బంది మమ్ముల్ని ఏడవవద్దని చెబుతూనే ఉన్నారు. కానీ మేము మా బాధను ఆపుకోలేకపోయాం. అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం అనంతరం బస చేసిన హోటల్కు బయలుదేరాం. హోటల్కి చేరుకునే సమయంలో మరోసారి సిబ్బంది స్పోర్టివ్గా ఉండాలని చెప్పారు' అని హర్మన్ చెప్పింది.
హోటల్కు చేరుకున్నాక ఓటమిని మరిచిపోయాం
హోటల్కు చేరుకున్న తర్వాత మేమంతా ఓటమిని మరిచిపోయి మా ప్రదర్శనను సెలబ్రెట్ చేసుకుంటూ డిన్నర్ చేశాం. నా జట్టుని చూసి ఎంతో గర్వంగా ఫీలవుతున్నాను. ఎందుకంటే ఈ వరల్డ్ కప్ టోర్నీలో ఫైనల్ చేరి నాకు మరిచిపోలేని అనుభూతిని మిగిల్చింది. అంతేకాదు ఈ టోర్నీలో మేము మంచి క్రికెట్ ఆడాం. ఇది మహిళా క్రికెట్ కు మంచి పరిణామం' అని పేర్కొంది.
ఫైనల్లో ఓటమి గతంలో మేము చూసిన ఓటముల్లో ఒకటి
'ఫైనల్లో ఓటమి గతంలో మేము చూసిన ఓటముల్లో ఒకటి. గెలవాలనుకున్నాం.. కానీ పోరాడి ఓడిపోవడాన్ని కూడా ఆస్వాదిస్తున్నాం. ఇక గతం మర్చిపోయి విజయాల కోసం పోరాడుతూ ముందుకు దూసుకెళ్లాలి' అని హర్మన్ ప్రీత్ కౌర్ తెలిపింది. ఈ టోర్నీలో కౌర్ తన కెరీర్లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ (115 బంతుల్లో 171 నాటౌట్) ఆడిన సంగతి తెలిసిందే.
ఫైనల్లో కౌర్ 51 పరుగులు చేసిన హర్మన్ ప్రీత్ కౌర్
ఫైనల్లో కౌర్ 51 పరుగులతో రాణించిన సంగతి తెలిసిందే. 'ఏ సిటీ ఆడుతున్నామో ముఖ్యం కాదు. క్రికెట్ ఆడటం నా కల. ఆ కలతోనే మన జాతీయ పతాకాన్ని రెపరెపలాడించాలి. మహిళా క్రికెట్ పట్ల ఇప్పుడిప్పుడే మన దేశంలో అవగాహన పెరుగుతోంది. రాబోయే రోజుల్లో మరింతగా ఆత్మవిశ్వాసం పెంచి క్రికెట్ ఆడేలా చేయండి' అని హర్మన్ ఈ సందర్భంగా కోరింది.