హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో వెస్టిండిస్పై ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా ఓపెనర్ నికోల్ బోల్టన్ (116 బంతుల్లో 107 నాటౌట్; 14 ఫోర్లు) అజేయ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ జట్టు 47.5 ఓవర్లలో 204 పరుగులు చేసిన ఆలౌటైంది. వెస్టిండిస్ జట్టులో హేలీ మాథ్యూస్ (63 బంతుల్లో 46; 7 ఫోర్లు), కెప్టెన్ స్టెఫానీ టేలర్ (57 బంతుల్లో 45; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. చెదిన్ నాషన్ 39, డియాండ్ర డాటిన్ 29 పరుగులు చేశారు.
161 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి పటిష్టంగా కనిపించిన వెస్టిండిస్ ఆ తర్వాత 43 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లను కోల్పోవడం విశేషం. ఆస్ట్రేలియా బౌలర్లలో ఎలైస్ పెర్రీ మూడు, జెస్ జొనసెన్, క్రిస్టెన్ బీమ్స్ చెరో 2 వికెట్లు తీశారు.
ఈ మ్యాచ్లో 9 ఓవర్లు వేసిన ఎలైస్ పెర్రీ 47 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. అనంతరం 205 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 38.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసి వెస్టిండిస్పై ఘన విజయం సాధించింది.
ఓపెనర్లు నికోల్, బెథ్ మూనీ (85 బంతుల్లో 70; 7 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్కు 171 పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. మంగళవారం జరిగే మ్యాచ్లో పాకిస్తాన్తో ఇంగ్లాండ్ తలపడనుంది.