కింగ్స్టన్: తొలి టెస్టులో టీమిండియా చేతిలో ఘోర పరాజయం పాలైన వెస్టిండీస్ రెండో టెస్టులో పుంజుకునేందుకు తీవ్ర కసరత్తులు చేస్తోంది. తొలి టెస్టులో ఓడిపోయాం కానీ, సిరీస్ మిగిలే ఉందని వెస్టిండీస్ ధీమా వ్యక్తం చేస్తోంది. అంతేగాక, టీమిండియాపై అస్త్రంగా ప్రయోగించేందుకు 19ఏళ్ల యువ పేసర్ అల్జారీ జోసెఫ్ను రంగంలోకి దించుతోంది.
గత సంవత్సరం జరిగిన అండర్-19 ప్రపంచ కప్ టోర్నీలో విండీస్కు ప్రాతినిథ్యం వహించిన జోసెఫ్.. ఆ జట్టుకు కీలకంగా మారాడు. ఆ టోర్నీలో ఉత్తమంగా రాణించిన బౌలర్లలో ఒకడిగా నిలిచాడు జోసెఫ్. 6.4 ఫీట్ల ఎత్తు ఉండే ఈ యువ బౌలర్.. అండర్ 19 ప్రపంచ కప్ టోర్నీలో వేగవంతమైన బంతులు వేసి 13 వికెట్లు తీశాడు.
బౌలింగ్ దిగ్గజం జోయెల్ గార్నర్ మేనేజర్గా ఉన్న విండీస్ జాతీయ జట్టులో జోసెఫ్.. మరింత రాణించే అవకాశం ఉందని ఆ జట్టు సెలక్షన్ ప్యానల్ ఛైర్మన్ కోర్ట్ నీ బ్రౌన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
జోసెఫ్ చేరికతో విండీస్ బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారుతుందని అన్నారు. సిరీస్ లో మిగిలిన మూడు మూడు టెస్టుల్లోనూ విండీస్ జట్టు ఉత్తమంగా ఆడి విజయాలు నమోదు చేస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. రెండో శనివారం (జులై30)నాడు కింగ్స్టన్ సిబినా పార్క్ స్టేడియంలో జరగనుంది. కాగా, తొలి టెస్టులో భారత్ 92 పరుగుల ఇన్నింగ్స్ తేడాతో విండీస్ జట్టును ఓడించిన విషయం తెలిసిందే.