హైదరాబాద్; సొంతగడ్డపై టీమిండియాను ఓడించడం కష్టమని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. సెప్టెంబర్-ఆక్టోబర్ మధ్య కాలంలో స్టీవ్ స్మిత్ నేతృత్వంలోని ఆసీస్ జట్టు ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు భారత పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మైకేల్ క్లార్క్ మీడియాతో మాట్లాడాడు. 'వన్డే, టెస్టు క్రికెట్ మధ్య చాలా తేడా ఉంటుంది. వన్డే క్రికెట్లో కొంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. భారత పర్యటనలో ఆసీస్ మంచి ప్రదర్శన చేసి విజయం సాధిస్తుందని భావిస్తున్నా. కాకపోతే ఇది కొంచెం కష్టమని తెలుసు. భారత్ను సొంతగడ్డపై ఎదుర్కోవడం కష్టమే' అని క్లార్క్ అన్నాడు.
ప్రస్తుతం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తోందని ముంబైలో 'ఆఫ్ బీట్ ఆస్ట్రేలియా' అనే షోని ప్రమోట్ చేసేందుకు వచ్చిన క్లార్క్ అభిప్రాయపడ్డాడు. 'గత రెండేళ్లుగా నేను క్రికెట్ దూరంగా ఉన్నాను. ప్రస్తుత భారత జట్టుపై నేను ఆడలేదు' అని అన్నాడు.
'టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యూహాన్ని గమనిస్తే.. అతను టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏ రెండు వరుస టెస్టు మ్యాచ్లకు ఒకే జట్టును ఎంచుకోలేదు. వెస్టిండీస్, శ్రీలంకను వారి సొంతగడ్డపై ఓడించి విజయాలు దక్కించుకున్నాడు. కోహ్లీ జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు' అని కోహ్లీ పేర్కొన్నాడు.
కోహ్లీ సేన తన విజయపరంపరను ఇలాగే కొనసాగిస్తే ప్రపంచంలో టీమిండియా నంబర్ వన్ జట్టుగా నిలవడం ఖాయమని క్లార్క్ తెలిపాడు. భారత బౌలింగ్లో ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వెన్నుముకగా నిలవడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడని క్లార్క్ తెలిపాడు.