న్యూఢిల్లీ: టీమిండియా ప్రధాన కోచ్ పదవి కోసం బీసీసీఐకి బ్యాటింగ్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ రెండు లైన్లతో రెజ్యూమె పంపినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంపై సెహ్వాగ్ తాజాగా స్పష్టతనిచ్చాడు. 'యూసీ వెబ్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ మాట్లాడుతూ... మీడియా ద్వారానే తాను రెండు లైన్ల దరఖాస్తు పంపినట్లు తెలుసుకున్నానని తెలిపాడు.
ఒకవేళ తాను రెండు లైన్ల దరఖాస్తు మాత్రమే పంపిస్తే అందులో తన పేరు మాత్రమే ఉంటుందని తెలిపాడు. 'ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్కు కోచ్గా పని చేశాను. ప్రస్తుత టీమిండియా జట్టులోని ఆటగాళ్లతో ఆడిన అనుభవం ఉంది' అన్న రెండు లైన్లతోనే సెహ్వాగ్ కోచ్ పదవికి దరఖాస్తు చేశాడని గతంలో పలు మీడియాల్లో వార్తలు వచ్చాయి.
కాగా, 'భారత క్రికెట్ జట్టు మాజీ సారథి సౌరభ్ గంగూలీ నుంచి ఓర్పుగా ఎలా ఉండాలో నేర్చుకున్నాను. తన ఆల్టైం ఫేవరెట్ కెప్టెన్ దాదానే' అని సెహ్వాగ్ తెలిపాడు. అనంతరం తన కెరీర్లో సచిన్ ప్రాధాన్యత గురించి వివరించాడు వీరూ.
'క్రికెట్లో ఎంతో మెరుగ్గా రాణించేందుకు సచిన్ ఎంతో సాయపడ్డాడు. నాలో ఆత్మస్థైర్యాన్ని నింపి మూఢనమ్మకాలపై నాకున్న భయాన్ని పోగొట్టాడు. మైదానంలో సచిన్తో కలిసి ఆడే సమయంలో ఎలాంటి ఒత్తిడి ఉండదు. చాలా సులువుగా బౌండరీలు బాదొచ్చు' అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
అంతేగాక, పాకిస్థాన్ జట్టుపై బౌండరీలు బాదడం అంటే తనకెంతో ఇష్టమని, ముఖ్యంగా 150కి.మీ. వేగంతో బంతిని వేసే షోయబ్ అక్తర్ బౌలింగ్లో బౌండరీలు కొట్టడం మరెంతో ఇష్టమని సెహ్వాగ్ వివరించాడు.
కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-పాక్ మ్యాచ్లను ఉద్దేశించి సెహ్వాగ్ చేసిన ట్వీట్పై లతీఫ్ చేసిన వ్యాఖ్యల గురించి స్పందిస్తూ.. 'ఫాదర్స్ డే రోజున భారత్-పాక్ మధ్య ఫైనల్ జరుగుతోన్న సందర్భంగా ట్వీట్లు చేశాను. లతీఫ్ వీడియో సందేశాన్ని నేను వినలేదు. ఆ అవసరం లేదు. మంచి దృష్టితోనే ట్వీట్లు చేశాను' అని సెహ్వాగ్ స్పష్టం చేశాడు.