హైదరాబాద్: ఈ ఏడాది జూన్లో ఇంగ్లాండ్లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా పాల్గొనడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ టోర్నీలో పాల్గొనబోయే జట్టును ప్రకటించడానికి ఐసీసీ విధించిన గడువు ముగిసింది. టోర్నీలో పాల్గొనబోయే మిగతా ఏడు దేశాలూ తమ జట్లను ప్రకటించగా, బీసీసీఐ మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు.
ఐసీసీ నిబంధనల ప్రకారం మంగళవారం (ఏప్రిల్ 25) లోపే జట్లను ప్రకటించాలి. తమ రెవెన్యూ వాటాను తగ్గిస్తే చాంపియన్స్ ట్రోఫీలో ఆడబోమని గతంలో బోర్డు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆదాయ పంపిణీ నమూనాను మార్చాలన్న ప్రతిపాదనతో పాటు అనేక అంశాలతో బీసీసీఐ విభేదిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా బీసీసీఐ ఉద్దేశపూర్వకంగానే జట్టును ప్రకటించలేదని తెలుస్తోంది. అయితే, కొన్ని సందర్భాల్లో డెడ్లైన్ దాటిన తర్వాత కూడా తమ జట్లను ప్రకటించేందుకు ఐసీసీ అనుమతిస్తోంది. జట్టును ప్రకటించకపోవడంపై బీసీసీఐ అధికారి మీడియాతో మాట్లాడాడు.
'మేం ఒకవేళ మే 5న జట్టును ప్రకటించామనుకోండి. ఐసీసీ ఏమైనా మమ్మల్ని టోర్నీ నుంచి బహిష్కరించేస్తుందా? జట్టు ప్రకటన నామమాత్రమే' అని అన్నాడు. కాగా, ప్రస్తుతం ఐసీసీలో కొనసాగుతున్న ఆదాయ పంపిణీ విధానాన్ని మార్చాలని గట్టు పట్టుదలతో ఉన్న ఛైర్మన్ శశాంక్ మనోహర్ కొత్త ప్రతిపాదనతో బీసీసీఐ ముందుకొచ్చాడు.
ఆ ప్రతిపాదన ఏంటంటే కొత్త ఆదాయ పంపిణీ ప్రకారం బీసీసీఐ ఆదాయంలో పెద్ద ఎత్తున కోత పడనున్న నేపథ్యంలో అదనంగా 100 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.650 కోట్లు) ఐసీసీ తరఫున ఇచ్చేందుకు సిద్దమైంది. అయితే ఈ ప్రతిపాదనను బీసీసీఐ అంగీకరించలేదు.
దీనిపై మనోహర్ గడువు విధించి, తనతో సంప్రదించాలని కోరగా.. బీసీసీఐ స్పందించనే లేదని తెలుస్తోంది. 'అవును. ఐసీసీ ఛైర్మన్ మనోహర్ కొత్త ఆదాయ పంపిణీలో భాగంగా అదనంగా 100 మిలియన్ డాలర్లు చెల్లించే ప్రతిపాదన చేశాడు. కానీ మేం ఆ ప్రతిపాదనకు అంగీకరించడం లేదు. ఎందుకంటే ఇది మనోహర్ ప్రతిపాదన. అతను ఐసీసీకి ఛైర్మన్ మాత్రమే. కానీ ఇక్కడ సభ్య దేశాల మాటే కీలకం. మేం అన్ని సభ్యులతో చర్చలు జరుపుతున్నాం' అని బీసీసీఐకి ఓ అధికారి తెలిపాడు.